రవితేజ మాటలకు యష్ ఫ్యాన్స్ అపార్థం అనవసరం

ఈ మధ్య అభిమానులు మరీ సున్నితంగా మారిపోతున్నారు. సోషల్ మీడియా ప్రపంచంలో ఇది మరింత ఎక్కువయ్యింది. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్లో భాగంగా ముంబై మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ దగ్గరకి పలువురు హీరోల ప్రస్తావన తెచ్చింది యాంకర్. వాళ్లలో రామ్ చరణ్, ప్రభాస్ కూడా ఉన్నారు. యష్ గురించి అడిగినప్పుడు మాస్ రాజా సమాధానమిస్తూ కెజిఎఫ్ దొరకడం అతని అదృష్టమని, యష్ గత సినిమాలేవీ చూడలేదని చెప్పాడు. ఇది కన్నడ ఫ్యాన్స్ ని బాధ పెట్టిందట. అంత స్టేచర్ ఉన్న తమ హీరో లక్కు మీద హిట్టు కొట్టాడని అంటారా అంటూ ట్వీట్ల పర్వం మొదలుపెట్టారు.

నిజానికి రవితేజ అన్నదాంట్లో తప్పేమి లేదు. కెజిఎఫ్ ని హిందీ తెలుగులో పదుల సంఖ్యలో చూసిన మూవీ లవర్స్ ఎవరూ అదే పనిగా యష్ పాత సినిమాలు వెతికి చూడలేదు. ఆ మాటకొస్తే తన క్రేజ్ ని క్యాష్ చేసుకుందామని ఒకటి రెండు గతంలో వచ్చిన చిత్రాలను డబ్బింగ్ చేస్తే సదరు నిర్మాతలకు పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. యష్ ఎవరో ప్రపంచానికి తెలిసింది కెజిఎఫ్ నుంచే. ఒకవేళ అతను ఒప్పుకోకపోయి ఉంటే ప్రశాంత్ నీల్ వేరొకరితో తీసేవాడే తప్ప ప్రాజెక్ట్ మొత్తాన్ని ఆపేసి ఉండడు. ఆ కోణంలో చూస్తే యష్ కి సరైన సమయంలో కెరీర్ లోనే అతి పెద్ద బ్రేక్ దక్కింది.

యష్ గురించి అవగాహన తక్కువ కాబట్టి రవితేజ పెద్దగా తెలియదు అన్నాడు. ప్రాక్టికల్ గా చూస్తే ఇద్దరూ కష్టపడి పైకొచ్చినవాళ్ళే. రవితేజ చిన్న వేషాల నుంచి ప్యాన్ ఇండియా స్థాయికి చేరుకుంటే టీవీ నటుడిగా మొదలుపెట్టి పెద్ద తలకాయలని దాటుకుని మరీ యష్ పెద్ద రేంజ్ చేరుకున్నాడు. కష్టపడే విషయంలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. ఇవన్నీ కాదు. అక్టోబర్ 20న కర్ణాటకలో టైగర్ నాగేశ్వరరావు  కన్నా ముందు కన్నడిగులు శివరాజ్ కుమార్ ఘోస్ట్ నే చూస్తారు. ఎందుకంటే వాళ్లకు మాస్ రాజా గురించి పూర్తిగా తెలియదు కాబట్టి. అంతమాత్రానికే ఇక్కడి అభిమానులు హర్ట్ అవుతారా.