‘టైగర్’ ఆఫీస్‌పై ఐటీ రైడ్స్

సినీ నిర్మాతల ఆఫీస్‌ల ఐటీ రైడ్స్ జరగడం కొత్తేమీ కాదు. ఒక ప్రొడక్షన్‌ హౌస్ నుంచి వరుసగా భారీ చిత్రాలు వస్తుంటే.. అలాగే ఏదైనా పెద్ద హిట్ కొట్టాక.. ఐటీ వాళ్లు రైడ్స్ చేయడం మామూలుగానే జరుగుతుంటుంది. కొన్ని నెలల కిందట మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, దర్శకుడు సుకుమార్‌ల ఆఫీసుల మీదా దాడులు జరిగాయి. కానీ అక్కడ సంచలనాత్మకంగా ఏమీ జరిగినట్లు వార్తలేమీ రాలేదు. ఆ వ్యవహారం చాలా సింపుల్‌గానే ముగిసిపోయింది.

ఇప్పుడు ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాకు సంబంధించిన ఆఫీస్‌ల మీద ఐటీ రైడ్స్ జరుగుతున్నాయన్న వార్త టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఐటీ రైడ్స్ అంటే మామూలే కదా.. ఇందులో ఆశ్చర్యపోవడానికి, ఆ విషయం హాట్ టాపిక్‌గా మారడానికి ఏముంది అనిపించొచ్చు. కానీ ఇక్కడ రైడ్స్ జరిగిన ఆఫీస్ ఎవరిది.. ఆ సినిమా తీసింది ఎవరు అన్నది కీలకమైన విషయం.

‘టైగర్ నాగేశ్వరరావు’ను నిర్మించింది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. దీని అధినేత అభిషేక్ అగర్వాల్‌కు బీజేపీ మనిషిగా బలమైన ముద్ర ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన సినిమాలు తీస్తున్నాడని కూడా అందరికీ తెలుసు. ‘కశ్మీర్ ఫైల్స్’ ఆయన సినిమానే అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆయన పెద్ద పెద్ద బీజేపీ నేతలతో కలిసి సన్నిహితంగా మెలిగారు.

బీజేపీ ప్రో సినిమాలు మరికొన్ని ప్లాన్ చేశారు కూడా. అందులో ‘ఇండియా హౌస్’ కూడా ఒకటి. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తికి సంబంధించిన సినిమా ఆఫీస్ మీద ఐటీ వాళ్లు దాడులు చేయడం అంటే ఇండస్ట్రీ జనాలందరికీ షాకింగ్‌గా అనిపిస్తోంది. అది కూడా సినిమా ఇంకో పది రోజుల్లో రిలీజ్ కాబోతుండగా.. ఇప్పుడు రైట్స్ ఏంటన్నది అంతుబట్టని విషయం. మరి ఈ విషయంలో ఏం మతలబు ఉందో?