2 వేల కోట్ల హీరోకు భారీ సెక్యూరిటీ

2023లో ఇండియన్ బాక్సాఫీస్‌ను బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ ఖాన్‌కు రాసిచ్చేశారనే చెప్పాలి. హిందీలో ఈ ఏడాది మిగతా చిత్రాలన్నీ కలిపి ఎంత వసూళ్లు రాబట్టాయో.. తన రెండు చిత్రాలు పఠాన్, జవాన్‌లతో దాదాపుగా ఆ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టాడు షారుఖ్. ఈ రెండు చిత్రాలూ యావరేజ్ టాక్‌తోనే ఒక్కోటి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. గత నెలలో విడుదలైన ‘జవాన్’ నెల తర్వాత కూడా ఓ మోస్తరు వసూళ్లతో నడుస్తోంది.

ఒకే ఏడాది ఒక హీరో ఇలాంటి రెండు భారీ బ్లాక్ బస్టర్లు ఇచ్చిన రికార్డు ఇప్పటిదాకా ఎన్నడూ చూసి ఉండం. ‘డుంకి’ కూడా ఈ ఏడాదే రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అది కూడా వెయ్యి కోట్లు కొల్లగొట్టడం ఖాయం. ఐతే ఈ సక్సెస్ ఆనందంలో ఉన్న షారుఖ్‌కు కొన్ని రోజుల నుంచి విపరీతంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. ఆయన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారట.

వీటిని షారుఖ్ కుటుంబ సభ్యులు తీసుకోవట్లేదు. ప్రభుత్వ వర్గాలకు సమాచారం ఇవ్వగా.. షారుఖ్‌కు భారీ భద్రత కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షారుఖ్‌కు వై ప్లస్ భద్రత కల్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం షారుఖ్‌కు వ్యక్తిగతంగా ఆరుగురు సెక్యూరిటీ అధికారులు 24 గంటల పాటు మూడు షిఫ్టుల్లో భద్రత కల్పిస్తారు.

దీంతో పాటుగా ఆయుధాలు కలిగిన ఐదుగురు గార్డులు షారుఖ్ ఇంటికి కాపలాగా ఉంటారు. బాలీవుడ్లో ఆల్రెడీ సల్మాన్ ఖాన్‌కు ఇలాంటి భద్రతే ఉంది. మరో బాలీవుడ్ తార కంగనా రనౌత్‌కు రెండేళ్ల కిందట ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. షారుఖ్‌కు ఇప్పటిదాకా వ్యక్తిగత భద్రత సిబ్బంది మాత్రమే ఉండేవారు. ఆయన ఎక్కడికైనా వెళ్తే బౌన్సర్లు వెంట నడిచేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రత కల్పించింది.