ట్రైలర్ బాలేదని థియేటర్ ధ్వంసం

ఒక భారీ అంచనాలున్న సినిమా చూస్తున్నపుడు ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తి ప్రదర్శన ఆగిపోతే.. ఎక్కువ టైం షో పున:ప్రారంభం కాకపోతే.. ప్రేక్షకులు అసహనంతో థియేటర్లను ధ్వంసం చేసిన ఉదంతాలున్నాయి. అలాగే సినిమా చాలా బాగుంటే ఆనందంలో సంబరాలు చేసుకుంటూ సీట్లను విరిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్‌లో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి.

ఐతే ఇప్పుడు తమిళనాట ఒక థియేటర్ ధ్వంసమైన తీరు.. అందుకు దారి తీసిన కారణం తెలిస్తే షాకవ్వకుండా ఉండలేం. చెన్నైలో బాగా ఫేమస్ అయిన రోహిణి థియేటర్‌ గురువారం సాయంత్రం దారుణంగా దెబ్బ తింది. ఇందుక్కారణం.. లియో ట్రైలర్ బాగా లేకపోవడమేనట. భారీ అంచనాలు నెలకొన్న ఈ ట్రైలర్‌ను థియేటర్లో ప్రత్యేకంగా ప్రదర్శించాలని నిర్ణయించారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఐతే అభిమానుల అంచనాలకు తగ్గట్లు ట్రైలర్ లేదు. ఒకటికి రెండుసార్లు ట్రైలర్‌ను ప్రదర్శించగా.. విజయ్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఐతే ఆ అసంతృప్తిని ఏ సంబంధం లేని థియేటర్ మీద చూపించడమే విడ్డూరం. థియేటర్లో మొత్తం అన్ని సీట్లను విరిచి పడేశారు. మొత్తంగా సీట్లన్నీ ధ్వంసమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ధ్వంసమైన థియేటర్లోనే మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లకు అభిమానులు లియో ట్రైలర్ గురించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ట్రైలర్ బాలేకుంటే టీంను తిట్టాలి కానీ.. అభిమానుల కోసమని ప్రత్యేకంగా ట్రైలర్‌ను ప్రదర్శించిన థియేటర్ మీద తమ ఆగ్రహాన్ని చూపించడం ఏం లాజిక్కో ఆ ఫ్యాన్స్‌కే తెలియాలి. ట్రైలర్ ప్రదర్శించిన పాపానికి లక్షల్లో నష్టపోయింది థియేటర్ యాజమాన్యం. ఇంకెప్పుడూ ట్రైలర్లను ఇలా థియేటర్లలో ప్రదర్శించకుండా యాజమాన్యాలకు గొప్ప పాఠమే నేర్పింది ఈ ఉదంతం.