రామ్ చరణ్ 17 అంత ఈజీ కాదు

నిన్న రామ్ చరణ్ ముంబైకి వెళ్లి అయ్యప్ప దీక్షను విరమించడంతో పాటు సిద్ది వినాయకుడి ఆలయానికి వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా తిరిగాయి. ఎంఎస్ ధోనితో దిగిన ఫోటోలు సరేసరి. ఒక యాడ్ షూట్ కోసం వెళ్లిన చరణ్ తో డుంకీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ చర్చలు జరిపినట్టుగా వచ్చిన వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ కాంబోలో ఒక సినిమా వస్తుందని, దాని కోసమే కథ వినేందుకు కలుసుకున్నారని రకరకాలుగా ప్రచారం జరిగింది. కలుసుకుంది నిజమే కావొచ్చు కానీ ఏకంగా ఒక ప్రాజెక్టు రూపొందుతుందని చెప్పడం అంత నమ్మశక్యంగా లేదు. దీనికి కారణం ఉంది.

సాధారణంగా రాజ్ కుమార్ హిరానీ వేగంగా సినిమాలు తీయరు. ఇరవై సంవత్సరాల గ్యాప్ లో ఆయన చేసింది కేవలం అయిదు సినిమాలే. ఆరోది డుంకీ. ఎంతలేదన్నా ఒక్కోదానికి గ్యాప్ మూడేళ్ళ నుంచి అయిదు సంవత్సరాల వరకు ఉంది. స్క్రిప్ట్ కోసమే కాలాన్ని లెక్క చేయకుండా ఖర్చు పెడుతూనే ఉంటారు. డుంకీ తర్వాత ఏది చేయాలో హిరానీ వద్ద అసలు కథే లేదట. అలాంటప్పుడు రామ్ చరణ్ తో చేతులు కలపడం ఇప్పట్లో జరగని పని. ఆయన వయసు అరవై దాటేసింది. ఇకపై వేసే అడుగులు ఎంచుకునే స్టోరీలు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో టైం పడుతుంది.

వినడానికి బాగానే ఉన్న చరణ్ రాజ్ కుమార్ హిరానీ కాంబో ఇప్పట్లో జరిగేది అయితే కాదు. గేమ్ చేంజర్ పూర్తి చేసి దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో జాయినయ్యేందుకు ఎదురు చూస్తున్న చరణ్ ఆ తర్వాత కమిట్ మెంట్ ఎవరితో అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. లిస్టులో ప్రశాంత్ నీల్ ఉన్నాడు కానీ జూనియర్ ఎన్టీఆర్ పూర్తి చేసి, ఆ తర్వాత సలార్ 2 ఫినిష్ చేసి ఇదంతా జరిగే లోపు 2026 వచ్చేస్తుంది. సో చరణ్ 17 ఏ దర్శకుడు హ్యాండిల్ చేస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. ఇంకో ఏడాది దాటితే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు. అందాక ఎదురు చూడాల్సిందే.