విశాల్ దెబ్బకు మొత్తం కదిలింది

తమిళ కథానాయకుడు, నిర్మాత విశాల్.. ఇటీవల ముంబయి సెన్సార్ బోర్డులో అవినీతిపై చేసిన ఆరోపణలు.. అతను రిలీజ్ చేసిన వీడియో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ సెన్సార్ చేయించేందుకు రూ.6.5 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను వెల్లడించాడు. స్క్రీనింగ్‌కు రూ.3 లక్షలు, సెన్సార్ సర్టిఫికేషన్‌కు రూ.3.5 లక్షలు ఇచ్చానంటూ ఎవరెవరికి డబ్బులు పంపింది అకౌంట్ వివరాలతో సహా అతను సోషల్ మీడియాలో పెట్టేశాడు.

ఈ వ్యవహారం ఫిలిం ఇండస్ట్రీలో దుమారం రేపింది. సెన్సార్ బోర్డులో అవినీతి గురించి వివిధ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. అలాగే సోషల్ మీడియాలో కూడా దీని మీద డిస్కషన్లు నడిచాయి. మీడియాలో ఈ వార్త సంచలనం రేపడంతో వెంటనే ప్రభుత్వం వైపు నుంచి చర్యలు కూడా మొదలయ్యాయి. ఈ వ్యవహారం మీద విచారణకు కమిటీ కూడా వేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.

ఐతే ఈ వ్యవహారం అంతటితో ముగియలేదు. కేంద్ర స్థాయిలో కూడా సెన్సార్ బోర్డు అవినీతి మీద చర్యలకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ ప్రసూన్ జోషి ఈ వ్యవహారంపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. విశాల్ ఆరోపణలపై చర్చించేందుకు.. సెన్సార్ బోర్డులో అవినీతిని అరికట్టేందుకు ఏం చేయాలన్నదానిపై ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.

వివిధ రాష్ట్రాల సెన్సార్ బోర్డు ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారట. విశాల్ ఆరోపణల మీద నేషనల్ మీడియాలోనూ చర్చ జరగడంతో.. ముంబయి సెన్సార్ బోర్డులో అప్పట్నుంచి కార్యకలాపాలు ఆగిపోయిన్లు తెలుస్తోంంది. పలు చిత్రాల సెన్సార్ పెండింగ్‌లో పడింది. దీని వల్ల కొన్ని సినిమాల రిలీజ్ డేట్లను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మొత్తంగా విశాల్ చేసిన పనితో దేశవ్యాప్తంగా సెన్సార్ బోర్డుల్లో కలకలం రేగిన సంకేతాలు కనిపిస్తోంది.