మళ్ళీ వెండితెరపై చారి భట్టుల అల్లరి  

జూనియర్ ఎన్టీఆర్ ఆల్ టైం ఎంటర్ టైనర్స్ లో అదుర్స్ ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ మూవీనే అయినప్పటికీ ఇందులో పండించిన వినోదం ఇంకే జూనియర్ మూవీలో లేదన్నది వాస్తవం. ముఖ్యంగా చారి భట్టులుగా తారక్, బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చే కామెడీ ఎప్పుడు చూసినా ఫ్రెష్ గా అనిపిస్తుంది. గురువు వెంటపడే నయనతారని శిష్యుడు లవ్ లో పడేసే ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో పేలాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సెకండ్ హాఫ్ లో హాస్యాన్ని బ్యాలన్స్ చేస్తూనే యాక్షన్ ని మిస్ చేయకుండా రెండో పాత్ర ద్వారా దర్శకుడు వివి వినాయక్ తీసుకున్న శ్రద్ధ మంచి అవుట్ ఫుట్ తీసుకొచ్చాయి.

మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అదుర్స్ ని జూనియర్ ఎన్టీఆర్ 23 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని నవంబర్ 18న థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చింది. ఎలాగూ 14 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇప్పుడు స్క్రీన్ మీద చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తారు. రీ రిలీజుల ప్రహసనం మొదలయ్యాక తారక్ సినిమాల్లో సింహాద్రికి భారీ స్పందన దక్కింది. బాద్షా, ఆంధ్రావాలా చేశారు కానీ అవి డిస్ట్రిబ్యూటర్ల అత్యుత్సాహం వల్ల ఆడియన్స్ కి చేరలేదు. కానీ అదుర్స్ కి ఆ సమస్య లేదు. దీనికున్న కల్ట్ ఫాలోయింగ్ వేరు.

త్వరలోనే దీని కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు చేయబోతున్నారు. కొన్నేళ్ల క్రితం అదుర్స్ 2  తీస్తారనే ప్రచారం జరిగింది కానీ ఓ ఇంటర్వ్యూలో అది సాధ్యం కాదని వినాయక్ తేల్చి చెప్పేశారు. ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఇమేజ్ అమాంతం మారిపోవడంతో ఎలాంటి రిస్కులు చేసే పరిస్థితి లేదు. పైగా అదుర్స్ లో కుదిరినట్టు ఆర్టిస్టులతో సహా అన్నీ మళ్ళీ అదే మేజిక్ ని రిపీట్ చేయడం కష్టం. దానికీ బదులు ఇలా మెమరీని రీ ఫ్రెష్ చేసుకుంటూ అదుర్స్ చూసేయడం బెటర్. అయితే దీపావళి సీజన్ కాబట్టి టైగర్ 3, మంగళవారం లాంటి కొత్త సినిమాల తాకిడిని తట్టుకునేలా ప్లాన్ చేసుకోవాలి.