టాలీవుడ్ మెగాస్టార్, కోలీవుడ్ సూపర్ స్టార్ ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడటం అరుదు. ఆ మధ్య భోళా శంకర్, జైలర్ తో క్లాష్ అయ్యారు కానీ ఫైనల్ విజేత ఎవరో అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ హీరోలుగా ఎదుగుతున్న టైంలో కలిసి చేసిన సినిమాలున్నాయి. కాళీలో స్నేహితులుగా స్క్రీన్ షేర్ చేసుకోగా బందిపోటు సింహంలో రజని హీరో, చిరు విలన్ గా నటించారు. తర్వాత ఈ కలయిక సాధ్యపడకపోయినా స్నేహం కొనసాగుతూ వచ్చింది. ఇక అసలు విషయానికి వద్దాం.
అక్టోబర్ 15 జైలర్ టూ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ప్రసక్తే లేకుండా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ బయట కనిపించకుండా దీని మీద వర్క్ చేస్తున్నారు. ఏళ్ళ తరబడి వాయిదాల్లో ఉన్న విశ్వంభరని అక్టోబర్ 16 రిలీజ్ చేసే ప్రతిపాదన దాదాపు ఓకే అయినట్టు ఇన్ సైడ్ టాక్. ఆగస్ట్ 22 మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ ఇవ్వొచ్చని అంటున్నారు. ఇంకో ఎనిమిది రోజులు వెయిట్ చేయాలి.
ఇక్కడితో అయిపోలేదు. జైలర్ 2 తర్వాత రజనీకాంత్ నటిస్తున్న ధర్మన్ 2027 సంక్రాంతి బరిలో దింపాలని నిర్మాత కమల్ హాసన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారట. చాలా కాలంగా తలైవర్ మూవీ పొంగల్ బరిలో లేకపోవడం ఫ్యాన్స్ వెలితిగా ఫీలవుతున్నారు. దీన్నలా ఉంచితే బాబీ కొల్లి డైరెక్షన్ లో రూపొందుతున్న మెగా 158 సంక్రాంతికే రిలీజ్ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించుకున్నారని వినికిడి. అదే నిజమైతే మరోసారి రజని, చిరు పరస్పరం తలపడటం చూడొచ్చు.
అయినా పెద్ద సినిమాలకు ఎవరూ మాట మీద నిలబడే పరిస్థితులు కనిపించడం లేదు. అదే నిజమైతే జైలర్ 2 ఆగస్ట్ లోనే రావాల్సింది. మన శంకరవరప్రసాద్ గారు కన్నా ముందు విశ్వంభర వచ్చి ఉండాలి. కానీ అవేవి జరగలేదు. ఒకవేళ పైన చెప్పినట్టు కనక జరిగితే మటుకు అరుదైన క్లాష్ గా మిగిలిపోతుంది. అసలే పండగని చాలా సినిమాలు టార్గెట్ చేసుకున్నాయి. వాటిలో ఏవి ఉంటాయో ఎవరు తప్పుకుంటారో రోజులు గడిచే కొద్దీ కాలమే సమాధానం చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates