మెగా తనయకి బుజ్జగింపుల పర్వం

తండ్రి హీరోగా నిర్మాత కార్డు వేసుకుని ఒక సినిమా తీయాలన్న చిరంజీవి కూతురు సుస్మిత కోరికకు బ్రేక్ పడినట్టు మెగా కాంపౌండ్ టాక్. ఆమె స్వంత బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ మీద కల్యాణ కృష్ణ దర్శకత్వంలో బెజవాడ ప్రసన్నకుమార్ కథతో తక్కువ టైంలో తీసేలా ఒక ప్రాజెక్టు నెలల క్రితమే ప్లాన్ చేసుకున్నారు. బ్రో డాడీ రీమేకనే ప్రచారం కూడా గట్టిగా జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలని చిరు నిర్ణయించుకున్నట్టు వినికిడి. దీని వల్ల ప్రీ ప్రొడక్షన్ కోసం ఖర్చు పెట్టిన మొత్తం వృథా అయినా పర్వాలేదని సుస్మితని బుజ్జగిస్తున్నట్టు వినికిడి.

ఇప్పుడు డ్రాప్ అయినా భవిష్యత్తులో మరో మంచి కథతో తప్పకుండ చేద్దామనే హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీని స్థానంలో బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందబోయే ప్యాన్ ఇండియా సినిమా పనులను వేగవంతం చేస్తున్నారు. ఢిల్లీలో చికిత్స తర్వాత ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న చిరంజీవి సెట్స్ లో అడుగు పెట్టేందుకు ఎలాగూ టైం పడుతుంది కాబట్టి ఆలోగా స్క్రిప్ట్ తో పాటు షెడ్యూల్స్ ప్లానింగ్ మొత్తం పూర్తి చేయబోతున్నారు. హీరోయిన్ల ఎంపిక కూడా దాదాపు కొలిక్కి వచ్చినట్టే. మరి మెగా 157 అని అనౌన్స్ మెంట్ గతంలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నెంబర్ మారుతుందేమో చూడాలి.

మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నిర్మాతలుగా చిరంజీవి సినిమాలు వచ్చాయి. తల్లి అంజనా దేవి పేరు సంస్థకు పెట్టారు. తండ్రి వెంకట్రావుని సమర్పకులుగా వ్యవహరింపజేశారు. ఇక బాలన్స్ ఉన్నది ఇద్దరు కూతుళ్లే. సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా చిరు వెన్నంటే ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్ గా కార్డు వేసుకుంటే వచ్చే కిక్కే వేరు. అయితే తాత్కలికంగా బ్రేక్ పడింది కాబట్టి మళ్ళీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి. ఇదంతా అఫీషియల్ గా ప్రకటించే అవకాశం లేనట్టే. మౌనంగా ఉన్నారంటేనే క్యాన్సిలయ్యిందని అర్థం చేసుకోవాలి అంతే.