‘ఆదిపురుష్’ అప్పుడే రెడీ అయింది

కొన్ని రోజులుగా అన్ని సినీ పరిశ్రమల్లోనూ ఒక చిత్రం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఆ సినిమానే.. ఆదిపురుష్. ఈ ఏడాది ఇండియాలో అతి పెద్ద హిట్‌గా నిలిచిన ‘తానాజీ’ని రూపొందించిన బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌.. మన ప్రభాస్ హీరోగా ఈ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇది భారతీయ హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం ఆధారంగా తెరకెక్కనుండటం, శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతుండటం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలు. ఐతే ‘తానాజీ’తో ఫేమ్ సంపాదించిన ఓం రౌత్.. ఆ సినిమా చేయడానికంటే ముందే ‘ఆదిపురుష్’ కథ రాశాడట. ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకునే ప్రధాన పాత్రను తీర్చిదిద్దాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడించాడు ఓం రౌత్.

‘‘తానాజీ’ సెట్స్‌పైకి వెళ్లక ముందు నుంచే నా మదిలో ‘ఆది పురుష్‌’ ఆలోచన వచ్చింది. చాలా పరిశోధన చేసి, ఒక రఫ్‌ డ్రాఫ్ట్‌ తయారు చేసుకున్నా. నా టీంకు ఈ కథ చెప్పగానే వాళ్లు చాలా ఎగ్జైట్ అయ్యారు. రెండు నెలల పాటు అందరం కూర్చుని ఆ రఫ్‌ డ్రాఫ్ట్‌ను తిరగరాశాం. స్క్రీన్‌ప్లేను అప్‌డేట్‌ చేశాం. కథా వస్తువులో మార్పులు లేనప్పటికీ దాన్ని ఎగ్జిక్యూషన్ మాత్రం కొత్తగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబించేలా కథను నవీకరించాం. లాక్‌డౌన్‌ ఎత్తేశాక ఈ మధ్యే ప్రభాస్‌ను కలిసి కథ వినిపించా. ప్రభాస్‌ మాత్రమే ఈ పాత్రకు సరిపోతాడని నాకు అనిపించింది. అతడి పర్సనాలిటీ, ప్రశాంత చిత్తం, లోతైన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు.. ఇలా ‘ఆదిపురుష్’లో ప్రధాన పాత్రకు కావాల్సిన అన్ని లక్షణాలూ అతడిలో చూశాను. ప్రభాస్ ఒప్పుకోకుంటే ఈ సినిమా చేసేవాడినే కాదు. ఇది శ్రీరాముడి కథ అన్నది నిజం. కానీ రామాయణాన్ని పూర్తిగా చూపించాం. అందులో ఇది ఒక భాగం. చారిత్రక కోణం నుంచి ఇప్పటికే దీనిపై పరిశోధన పూర్తి చేశాం. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయి’’ అని రౌత్ తెలిపాడు.