విజయ్ ఫంక్షన్ కోసం ఇంత రభసా

చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న లియో ఆడియో ఫంక్షన్ రద్దు కావడం పట్ల కోలీవుడ్ వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. నిర్మాణ సంస్థ దీనికి సంబంధించి వివరణ ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూటా డెబ్భై సినిమాలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ కు రాని సమస్య విజయ్ కు మాత్రమే ఎందుకు ఊహిస్తున్నారని నిలదీస్తున్నారు. కేరళలో చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ మేకర్స్ మాత్రం భయపడుతున్నారు. అయితే పైకి కనిపించినంత తేలిగ్గా ఈ వ్యవహారం లేదని చెన్నై వర్గాల కథనం.

కొంచెం డీటెయిల్స్ లోకి వెళదాం. లియో వేడుక కోసం ఎంపిక చేసిన చెన్నై జవహర్ లాల్ నెహ్రు స్టేడియం కెపాసిటీ 8000. స్టేజి నిర్మించాక అది 6000కు తగ్గిపోతుంది. పది శాతం సీట్లు సదరు గ్రౌండ్ యాజమాన్యంకు ఇవ్వాలి. అది ఒప్పందంలో ముందే రాసుకుంటారు. అంటే నిర్వాహకులకు మిగిలేవి 5400 సీట్లు మాత్రమే. నిర్మాత తనకు కనీసం 3000 టికెట్లు కావాలని ముందే చెప్పేశాడు. స్పాన్సర్లు, బిజినెస్ పార్ట్నర్ల కోసం. అయితే విజయ్ మక్కల్ ఇయక్కం జనరల్ సెక్రటరీ అయిన బుస్సీ ఆనంద్ ఫ్యాన్ అసోసియేషన్ల కోసం 4000 టికెట్లు ఖచ్చితంగా కావాలని డిమాండ్ చేశాడు.

దీంతో ఏకాభిప్రాయం రాకపోవడంతో మొత్తానికి క్యాన్సిల్ చేశారు. ఈలోగా తెలిసిన మరో ట్విస్టు ఏంటంటే ఒరిజినల్ ని తలదన్నేలా ఉన్న నకిలీ టికెట్లు సుమారు 10 వేలకు పైగా మార్కెట్ లో చెలామణిలోకి వచ్చేశాయి. వీటిని భారీ రేట్లకు అమ్ముకున్నారు కూడా. ఒకవేళ ఫంక్షన్ నిర్వహిస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని గ్రహించి వెంటనే రద్దు చేసేశారు. ఇటీవలే ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదట. అయినా లక్షలాది ఫ్యాన్స్ తో ఎన్నో తెలుగు ఫంక్షన్లు పబ్లిక్ గ్రౌండ్స్ లో గొప్పగా జరిగాయి. జస్ట్ వేల మందికే ఇంత ఇదై పోవడం విచిత్రమే.