మూడో టైగర్ సందేశం చాలా పవర్ ఫుల్

కండల వీరుడు సల్మాన్ ఖాన్ త్వరలోనే టైగర్ 3 గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ పేరుతో తీసుకొస్తున్న సిరీస్ లో భాగంగా దీన్ని టైగర్ జిందా హై, వార్, పఠాన్ లకు ముడిపెట్టబోతున్నారు. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ తో కలిసి సల్మాన్ చేసిన విన్యాసాలను జనవరిలో చూశాం. మళ్ళీ ఈ ఇద్దరి  కాంబోని మరోసారి స్పెషల్ ఎపిసోడ్ రూపంలో బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేసే అవకాశం దక్కనుంది. దీపావళి విడుదలని ఖరారు చేసుకున్న టైగర్ 3 డేట్ ని మాత్రం సస్పెన్స్ లో పెట్టింది. టైగర్ కా మెసేజ్ పేరుతో అన్ని భాషల్లో ఒక చిన్న టీజర్ ని వదిలారు.

స్పష్టంగా కాదు కానీ కథకు సంబంధించిన కొన్ని క్లూస్ అయితే ఇచ్చారు. అవినాష్ సింగ్ అలియాస్ టైగర్(సల్మాన్ ఖాన్) ఇరవై సంవత్సరాలకు పైగా దేశం కోసం తన జీవితాన్ని పణంగా పెడతాడు. ఎంతో చేస్తాడు. కానీ కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల చేయని తప్పుకు దేశద్రోహిగా ముద్రపడి అజ్ఞాతంలోకి వెళ్తాడు. అయితే తన కొడుక్కు తానేంటో చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది ఇండియానే బదులు చెప్పాలన్నది టైగర్ లక్ష్యం. అలా అని శత్రువులతో యుద్ధం ఆపడు. టైగర్ ఓడిపోవాలంటే ముందు చావు అతన్ని గెలవాలనే పంతం అతనిది. అదెలాగో తెరమీద చూడాలి.

విజువల్స్ ఊహించినట్టే పవర్ ఫుల్ గా ఉన్నాయి. స్పై బ్యాక్ డ్రాప్ లో సాధారణంగా కథ పరంగా పెద్దగా ప్రయోగాలు ఉండవు. గ్రాండియర్ నెస్, యాక్షన్ ఎపిసోడ్స్ మీదే ఆధారపడాలి. అవి సరిగ్గా కుదిరితే పఠాన్ లాగా కనకవర్షం కురిపిస్తుంది. దర్శకుడు మనీష్ శర్మ వాటికి లోటు లేకుండా చూసుకున్నట్టు కనిపిస్తోంది. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ గూఢచారి సినిమాకు ప్రీతం సంగీతం సమకూర్చారు. నవంబర్ 10 లేదా 13 రెండు డేట్లు టైగర్ 3 పరిశీలనలో ఉన్నాయి. త్వరలో ట్రైలర్ తో పాటుగా దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. మొత్తానికి టైగర్ వాయిస్ తో ఫ్యాన్స్ ఖుషినే.