మహేష్ బాబు 29 ముందు మరో సినిమా?

ప్రస్తుతం గుంటూరు కారం తప్ప వేరే ప్రపంచం లేకుండా ఉంటున్న మహేష్ బాబు ఆ తర్వాత రాజమౌళి కోసం రెడీ అవ్వాల్సిన సంగతి తెలిసిందే. అయితే జక్కన్న ఇంకా స్క్రిప్ట్ ని లాక్ చేయలేదు. పలుదఫాలుగా చర్చలు చేస్తూ టీమ్ తో కలిసి కథకు ఒక రూపం ఇవ్వడానికి పని చేస్తున్నట్టు తెలిసింది. తండ్రి విజయేంద్రప్రసాద్ ఇచ్చిన స్టోరీకి ట్రీట్ మెంట్ సిద్ధం చేయడానికి ఎంతలేదన్నా ఇంకో ఆరేడు నెలలు పట్టొచ్చని ఇన్ సైడ్ టాక్. మహేష్ డిసెంబర్ నుంచి ఖాళీ అవుతాడు. ప్రమోషన్ల కోసం తిరిగినా సంక్రాంతికి త్రివిక్రమ్ మూవీ రిలీజయ్యాక చాలా ఫ్రీ టైం దొరుకుతుంది.

రాజమౌళిది ఆగస్ట్ కన్నా ముందు మొదలుపెట్టే ఛాన్స్ లేకపోవడంతో ఆలోగా ఇంకో సినిమా చేయాలనే ఆలోచన మహేష్ బాబు సీరియస్ గా చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా తనతో వేగంగా షూటింగులు చేసింది ఇద్దరే. ఒకరు పూరి జగన్నాధ్. రెండు అనిల్ రావిపూడి. ఫస్ట్ ఆప్షన్ సాధ్యం కాదు. సరిలేరు నీకెవ్వరు టైంలోనే ఇంకో పవర్ ఫుల్ సబ్జెక్టు తన వద్ద ఉందని అప్పట్లోనే అనిల్ హింట్ ఇచ్చాడు. డేట్లు వరసగా ఇస్తే ఆరు నెలల్లో ఫస్ట్ కాపీ సిద్ధం చేయగల టాలెంట్ ఇతనిది. భగవంత్ కేసరి రిలీజ్ తర్వాత మహేష్ ని కలిసి తనదగ్గరున్న లైన్ వినిపించవచ్చని తెలిసింది.

దీనికి నిర్మాతగా అనిల్ సుంకర వ్యవహరించవచ్చనే ప్రచారం ఫిలిం నగర్లో జోరుగా ఉంది. ఏజెంట్, భోళా శంకర్ డబుల్ డిజాస్టర్ల దెబ్బకు ఆయన బాగా కుదేలైపోయాడు. ఈ కారణంగానే తన ప్రొడక్షన్ లో చేస్తే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కాంబో కార్యరూపం దాల్చొచ్చని ఘట్టమనేని వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అధికారికంగా ప్రకటించే దాకా చెప్పలేం కానీ రాజమౌళికి ఎంతలేదన్నా రెండు మూడేళ్ళ టైంని ఇచ్చేయాల్సి ఉంటుంది కాబట్టి మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత ఒకటి కాదు మరో రెండు చేసినా బాగుంటుంది. కాకపోతే కథలు కాంబోలు సెట్టవ్వాలి.