రూటు మార్చబోతున్న సమంత

సమంత కెరీర్ ఈ మధ్య ఏమంత ఆశాజనకంగా లేదు. లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘శాకుంతలం’ దారుణమైన ఫలితాన్నందుకోగా.. ఇటీవలే వచ్చిన రొమాంటిక్ మూవీ ‘ఖుషి’ సైతం నిరాశ పరిచింది. ఈ రెండు చిత్రాలకూ సమంత మైనస్ అయ్యిందనే చర్చ కూడా జరిగింది. సమంత అనారోగ్యం కూడా ఆమె లుక్స్, కెరీర్ మీద ప్రతికూల ప్రభావం చూపించినట్లు కనిపిస్తోంది.

వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవడం.. చికిత్స కోసం సినిమాల నుంచి గ్యాప్ కూడా తీసుకోవడంతో సమంత కెరీర్ ఇక పుంజుకోవడం కష్టమే అని భావిస్తున్నారు. ఇలాంటి టైంలోనే యుఎస్‌ నుంచి తన అభిమానులతో ఆమె ముచ్చటించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జరిగిన ఈ చిట్ చాట్‌లో కొత్త ప్రాజెక్టుల గురించి అడిగితే.. ‘ఖుషి’ తర్వాత ఇంకా ఏమీ ఒప్పుకోలేదని ఆమె చెప్పింది. ఐతే ఇకపై తాను రూటు మార్చి భిన్నమైన పాత్రలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది.

‘‘కొత్త ప్రాజెక్టుల గురించి ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవు.  ఇక నుంచి కథల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా. నాకు సూటయ్యే కథలు, పాత్రలతోనే ప్రయాణం చేయాలనుకుంటున్నా. నా కంఫర్ట్ జోన్‌ను దాటి కథలు చేయాలి. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని సామ్ చెప్పింది. మీ చర్మం చాలా కాంతివంతంగా మారిందే అని ఒక అభిమాని కామెంట్ చేస్తే.. నిజానికి మయోసైటిస్ చికిత్స తర్వాత తన చర్మం పాడైనట్లు సామ్ తెలిపింది.

‘‘మీరు అనుకుంటున్నట్లు ఏమీ లేదు. మయోసైటిస్ చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్ ఇచ్చారు. చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డా. విపరీతమైన పిగ్మెంటేషన్ వచ్చింది. చిన్మయి మళ్లీ నన్ను గ్లాసీగా మారుస్తానని చెప్పింది’’ అని సామ్ తెలిపింది. ‘సిటాడెల్’ సిరీస్‌లో తన పాత్ర హాట్‌గా, ఫన్నీగా ఉంటుందని.. ఆ పాత్ర తనకెంతో సవాలు విసిరిందని.. తన నుంచి ఆ సిరీస్‌లో బోలెడంత యాక్షన్ చూడొచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా సామ్ చెప్పింది.