ప్రతినిథి 2 పదును పెంచనున్న రోహిత్

ఒక్కవారంలోనే ఏపీ రాజకీయ ముఖచిత్రం విపరీతమైన మార్పులకు లోనైంది. ఊహించని పరిణామాలకు పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.  ఎన్నికలకు ఇంకా టైం ఉందనుకుంటున్న తరుణంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ప్రకంపనలు పుట్టాయి. నిన్న తెలుగుదేశం జనసేన అధికారిక పొత్తు ప్రకటనతో లోకేష్ పవన్ కళ్యాణ్ లు దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పెదనాన్నకు జరిగిన అవమానం పట్ల రగిలిపోతున్న నారా రోహిత్ ప్రస్తుతం తాను నటిస్తున్న ప్రతినిథి 2 స్క్రిప్ట్ లో కొన్ని కీలక మార్పులు చేయిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.

టీవీ 5 మూర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ప్రతినిథి 2 వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో విడుదల చేస్తామని ఓపెనింగ్ సమయంలోనే ప్రకటించారు. అప్పటికే ప్రస్తుత ప్రభుత్వ పాలనను ఎండగట్టే రీతిలో చాలా విషయాలు పొందుపరిచారట. ఇప్పుడు బాబుని జైలు పాలు చేశాక పొలిటికల్ హీట్ పెరిగింది కాబట్టి ఈ సంఘటనను ప్రస్తావిస్తూ అధికారం అడ్డు పెట్టుకుని రూలింగ్ పార్టీ ఇలా చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసేలా, ప్రేక్షకులు ఆలోచించేలా అదనంగా ఎపిసోడ్లు జోడిస్తారని తెలిసింది. ఇటీవలే రోహిత్ టిడిపి ఆఫీస్ కు వచ్చి సంఘీభావం తెలిపాడు.

మీడియా ముందుకు నేరుగా రాకపోయినా రోహిత్ జరుగుతున్న సంఘటనలను నిశితంగా గమనిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఎలాగూ యాత్ర 2 మొత్తం జగన్ ఎలివేషన్లతో నింపేస్తారు కాబట్టి దానికన్నా ముందుగా వచ్చే ప్రతినిథి 2లో పేర్లు ప్రస్తావించకుండా జరుగుతున్న తప్పులను ఎత్తి చూపించేలా అవుట్ ఫుట్ ని సిద్ధం చేస్తారట. ఇంకా చిత్రీకరణ చాలా బాలన్స్ ఉంది కాబట్టి మార్పులకు బోలెడు అవకాశముంది. హీరోగా రేసులో వెనుకబడిన నారా రోహిత్ తిరిగి ఫామ్ లోకి వచ్చేలా ప్రతినిథి 2 ఉంటుందనే టాక్ అయితే అంతర్గత వర్గాల్లో వినిపిస్తోంది. చూడాలి మరి ఏం చేస్తారో.