అభిమానుల కోపాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నమా

నిన్న సలార్ వాయిదా తాలూకు అధికారిక ప్రకటన చాలా నింపాదిగా నెమ్మదిగా హోంబాలే ఫిలిమ్స్ ఇవ్వడం ఫ్యాన్స్ ఆగ్రహాన్ని ఎంత మాత్రం చల్లార్చలేదు. వారం రోజులుగా ప్రపంచం మొత్తం ఈ వార్త మారుమ్రోగుతున్నా తమకు వినిపించనే లేదన్న రీతిలో వ్యవహరించిన నిర్మాతలు కనీసం కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించినా బాగుండేది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పటికి పూర్తవుతాయో యూనిట్ కే అంతు చిక్కడం లేదట. పైగా ఫస్ట్ కాపీ చూసి పూర్తిగా సంతృప్తి చెందితేనే తప్ప డేట్ విషయంలో ఎలాంటి మాట ఇవ్వలేనని దర్శకుడు ప్రశాంత్ నీల్ తేల్చి చెప్పడం ఈ పరిస్థితికి కారణమంటున్నారు.

సరే ఇంత గందరగోళం బజ్ పరంగా మంచి కాదు కాబట్టి నిన్న హఠాత్తుగా సలార్ డిజిటల్,శాటిలైట్, ఆడియో అన్ని కలిపి 350 కోట్లకు అమ్మేసినట్టుగా వచ్చిన వార్తని తెరపైకి తెచ్చారన్న కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పోస్ట్ పోన్ గురించి మాట్లాడుకుంటూ దాని మీద నెగటివ్ గా ఉన్న ఫ్యాన్స్ ని దృష్టి మరల్చే ఉద్దేశంతో ఇలా ఓటిటి న్యూస్ తో హడావిడి చేశారనే వాదనలో ఎంతో కొంత నిజమైతే కనిపిస్తోంది. ఎందుకంటే సలార్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు కావాల్సింది సినిమా ఎంతకు సేలయ్యిందని కాదు. థియేటర్లలో తాము ఎప్పుడు చూడబోతున్నామమనే క్లారిటీ.

అది స్పష్టంగా ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంతో ఇలా హక్కులు అమ్ముడుపోవడం గురించి హైలైట్ చేశారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఏది ఏమైనా వీలైనంత త్వరగా సలార్ రిలీజ్ కు సంబంధించిన నిర్ణయం తీసుకోవడం మంచిది. నవంబర్ లో టైగర్ 3, డిసెంబర్ లో నాని, నితిన్, వెంకటేష్ ల సినిమాలున్న నేపథ్యంలో త్వరగా డెసిషన్ చెప్పేస్తే మిగిలినవాళ్లకు అనుకూలంగా ఉంటుంది. లేదంటే మొన్న తప్పుకున్న తర్వాత ఏర్పడ్డ గందరగోళం మళ్ళీ మళ్ళీ రిపీట్ కావడం ఖాయం. విడుదల తేదీ పొందుపరిస్తే తప్ప ట్రైలర్ ని వదలకూడదని డిసైడ్ కావడం అన్నింటిలోకి ఫైనల్ ట్విస్ట్.