బ్లాక్‌బస్టర్ నం.5.. తర్వాత ఎవరితో?

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ల లిస్టు తీస్తే.. అందులో ముందుగా రాజమౌళి పేరుంటుంది. రెండు దశాబ్దాల కెరీర్లో రాజమౌళికి అపజయం అన్నదే లేదు. ఆయన తర్వాత వరుసగా బ్లాక్‌బస్టర్లతో దూసుకుపోతున్న డైరెక్టర్ అంటే.. అట్లీ అనే చెప్పాలి. తొలి సినిమా ‘రాజా రాణి’తో మొదలుపెడితే.. ‘తెరి’, ‘మెర్శల్’; ‘బిగిల్’ ఇలా తమిళంలో వరుసగా బ్లాక్‌బస్టర్లు ఇచ్చాడతను.

ఇప్పుడు ‘జవాన్’ సైతం పెద్ద హిట్ అయింది. అట్లీ ప్రతి సినిమాకూ డివైడ్ టాక్ రావడం.. రొటీన్‌గా ఉందనడం.. వేరే సినిమాలతో పోలికలు పెట్టడం మామూలే. కానీ ఈ కామెంట్లన్నింటినీ దాటుకుని తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకోవడమూ మామూలే. ‘జవాన్’ విషయంలోనూ అదే జరిగింది. నాలుగు రోజుల్లోనే రూ.500 కోట్ల వసూళ్లతో ఆల్రెడీ బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకుంది ‘జవాన్’.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్‌ ఖాన్‌తో సినిమా చేసి అక్కడా ఘనవిజయాన్నందుకోవడంతో అట్లీ డిమాండ్ మరింత పెరిగిపోయింది. దీంతో తన తర్వాతి సినిమా మీద అందరి దృష్టీ నిలిచింది. వేర్వేరు ఇండస్ట్రీల నుంచి టాప్ స్టార్లు తనతో సినిమా చేయడానికి ఆసక్తితో ఉన్నారు. తెలుగులో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్‌లతో ఇంతకుముందే అట్లీ సంప్రదింపులు జరిపాడు.

తమిళంలో విజయ్‌తో మళ్లీ ఇంకో సినిమా చేయొచ్చనే ప్రచారమూ జరుగుతోంది. ‘జవాన్’తో హీరోగా, నిర్మాతగా కోరుకున్నదానికంటే పెద్ద హిట్ కొట్టిన షారుఖ్ సైతం.. అట్లీతో ఇంకో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ‘జవాన్’ సక్సెస్ చూసి బాలీవుడ్లో వేరే స్టార్లు కూడా తనకోసం ఎంక్వైరీలు చేస్తున్నారు. ఇలా అట్లీకి డిమాండ్ అయితే మామూలుగా లేదు. ఇన్ని ఆప్షన్ల నుంచి అట్లీ దేన్ని ఎంచుకుంటాడన్నదే ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి అతను ఓ తెలుగు స్టార్‌తో పాన్ ఇండియా సినిమా చేసే  అవకాశాలే ఎక్కువ అంటున్నారు.