కోరుకున్న సినిమా ప్రకటించారు.. కానీ 

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. తమిళం వరకు అయితే అతనే ప్రస్తుతం నంబర్ వన్ దర్శకుడు. ‘విక్రమ్’ సూపర్ సక్సెస్ కావడంతో అతడి రేంజే మారిపోయింది. చాలా ఏళ్లుగా సినిమాలే చేయని కమల్ హాసన్‌ను ‘విక్రమ్’లో ప్రెజెంట్ చేసిన తీరు.. తాను ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నింటినీ కనెక్ట్ చేస్తూ అతను పరిచయం చేసిన మల్టీవర్స్ కాన్సెప్ట్ జనాలకు విపరీతంగా నచ్చేశాయి.

‘విక్రమ్’ తర్వాత విజయ్‌తో లోకేష్ చేస్తున్న ‘లియో’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లోకేష్‌తో సినిమా చేయడానికి వివిధ భాషలకు చెందిన పెద్ద పెద్ద స్టార్లు ఎంతో ఆసక్తితో ఉన్నారు. అతను ఇంకా విక్రమ్-2, ఖైదీ-2లతో పాటు సూర్య హీరోగా ‘రోలెక్స్’ పేరుతో మరో సినిమా కూడా చేయాల్సి ఉంది. ఐతే వాటి కంటే ముందు అతను సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేయబోతున్నాడు. కొన్ని నెలల ముందే దీని గురించి హింట్ రాగా.. ఈ రోజు అధికారికంగానే సినిమాను ప్రకటించారు.

సూపర్ స్టార్‌తో వరుసగా సినిమాలు చేస్తున్న సన్ పిక్చర్స్ సంస్థే రజినీ-లోకేష్ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతోంది. ‘జైలర్’తో భారీ లాభాలు అందుకున్న ఆ సంస్త.. రజినీతో చేయనున్న కొత్త సినిమా గురించి ఈ రోజు ఘనంగా ప్రకటన ఇచ్చింది. లోకేష్ చిత్రాలకు ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోయిన అనిరుధ్ రవిచందరే ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించబోతున్నాడు. అన్బు-అరివు యాక్షన్ కొరియోగ్రఫీ చేయబోతున్నారు. ఐతే ఈ సినిమా ప్రకటన రజినీ అభిమానులకు ఆనందాన్నిస్తూనే.. వారిలో చిన్న కలవరాన్ని కూడా రేపింది.

లోకేష్‌తో చేయబోయే చిత్రంతోనే రజినీ సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతాడని ముందు నుంచి ప్రచారం జరుగుతుండటమే అందుక్కారణం. రజినీ వయసిప్పుడు 73 ఏళ్లు. ఆయనకు చాలా కాలంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వయసు, అనారోగ్య ప్రభావం రజినీపై బాగానే పడుతోందని ‘జైలర్’ చూస్తేనే అర్థమైంది అభిమానులకు. కుటుంబ సభ్యులు ఆయనిక విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లాల్ సలామ్’లో ప్రత్యేక అతిథి పాత్ర చేస్తున్న రజినీ.. ‘జై భీమ్’ ఫేమ్ జ్ఞానవేల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అవి పూర్తయ్యాకే లోకేష్ సినిమా మొదలవుతుంది.