థియేటర్లో అదుర్స్ ఓటిటిలో బెదుర్స్

ఎంత బ్లాక్ బస్టరైనా సరే ప్రతి సినిమాను జనాలందరూ థియేటర్లోనే చూస్తారన్న గ్యారెంటీ లేదు. రకరకాల కారణాల వల్ల ఓటిటి లేదా శాటిలైట్ లో వచ్చినప్పుడు చూద్దాం లెమ్మని ఎదురు చూసేవాళ్ళు లక్షల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉంటారు. అందుకే డిజిటల్ సంస్థలు భారీగా కోట్లు కుమ్మరించి మరీ హక్కులను సొంతం చేసుకునేందుకు పోటీ పడతాయి. అయితే ఇక్కడ కూడా అదే స్పందన వస్తుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. గత రెండు నెలల్లో సెన్సేషనల్ హిట్ మూవీస్ గా నిర్మాతలను లాభాల్లో ముంచెత్తిన బేబీ, జైలర్ గురించే ఈ టాపిక్.

మొన్నటికి మొన్న జైలర్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చేసింది. దీన్ని మొదటిసారి టీవీలో చూసిన సగటు ప్రేక్షకులు దీంట్లో అంతగా ఏముందని ఆరు వందల కోట్లు వచ్చాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సునీల్ కామెడీ, మన్యవర్ షోరూమ్ నుంచి తీసుకొచ్చినట్టు ఉండే తలపాగాని కిరీటంగా బిల్డప్ ఇవ్వడం, ఇంటర్వెల్ దాకా హత్యలు తప్ప రజని ఇంకేం చేయకపోవడం లాంటి అంశాల పట్ల నెగటివ్ ఫీడ్ బ్యాక్ గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అనిరుద్ రవిచందర్ బీజిఎంని డాల్బీ అట్మోస్ లో ఆస్వాదిస్తేనే జైలర్ ని ఎంజాయ్ చేయగలం. కానీ ఇంట్లో ఆ ఛాన్స్ ఎక్కడిది.

ఇక బేబీ సైతం ఆహాలో వచ్చాక పోస్ట్ మార్టంకు గురవుతోంది. ఇంత అపరిపక్వ ప్రేమకథకి తొంబై కోట్ల గ్రాస్ ఇచ్చారా అంటూ నెటిజెన్లలు కొందరు షాకింగ్ ఎక్స్ ప్రెషన్లు ఇస్తున్నారు. గతంలో ఇదే తరహాలో జాతరత్నాలు, ఉప్పెన, వాల్తేరు వీరయ్య లాంటి వాటికి కూడా ఈ విమర్శల పర్వం తప్పలేదు. వెండితెరపై మంచి సౌండ్ తో దక్కే ఎక్స్ పీరియన్స్ ని సోఫాలో కూర్చుని ఫార్వార్డ్ చేసుకుంటూ చూస్తే ఖచ్చితంగా పొందలేం. అందుకే అభిప్రాయాల్లో ఇంత వైరుధ్యం కనిపిస్తోంది. రేపు జవాన్ కూడా దీనికి మినహాయింపుగా ఉండకపోవచ్చు. అందుకే బిగ్ స్క్రీన్ ఈజ్ బెస్ట్ అని ఊరికే అనలేదు.