స్పైడర్ విలన్ శుక్రమహర్దశ నడుస్తోంది

మహేష్ బాబు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఒక పీడకల స్పైడర్. దర్శకుడు మురగదాస్ ని సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శిస్తూనే ఉంటారు. అంత పెద్ద అవకాశం వచ్చినప్పుడు దాన్ని కనీస స్థాయిలో సద్వినియోగపరుచుకోలేదనే కోపం వాళ్లలో ఉంది. విలన్ గా నటించిన ఎస్ జె సూర్యతోనూ ఇలాంటి కంప్లయింట్ ఉంది,. నాని అనే కళాఖండాన్ని డైరెక్ట్ చేసింది ఇతనే. పవన్ కళ్యాణ్ కేమో ఖుషి ఇచ్చి మాకు మాత్రం ఇలాంటి డిజాస్టర్ తీస్తావాని సోషల్ మీడియా లేని కాలంలో ఫాన్స్ ఎంత తిట్టుకున్నారో. ఇదంతా పక్కన పెడితే నటుడిగా ఎస్జె సూర్యకు శుక్రమహర్దశ నడుస్తోంది.

చాలా క్రేజీ ప్రాజెక్టుల్లో తను భాగమై ఉన్నాడు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో ఎస్ జె సూర్యనే మెయిన్ విలన్. ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ పొలిటికల్ డ్రామాలో హీరోతో పోటీపడే క్యారెక్టర్ నువ్వా నేనా అన్నట్టు ఉంటుందట. కమల్ హాసన్ ఇండియన్ 2లోనూ శంకర్ ఛాన్స్ కల్పించాడు. ఇది కూడా అంతే మోతాదులో కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్. జిగర్ తండా డబుల్ ఎక్స్ లో లారెన్స్ తో సమానంగా కనిపించే క్యారెక్టర్ లో ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. విశాల్ తో స్క్రీన్ షేర్ చేసుకుని వచ్చే వారం రిలీజ్ కాబోతున్న మార్క్ ఆంటోనీ సైతం భారీ చిత్రమే.

ఇవి కాకుండా ధనుష్ 50వ సినిమాలోనూ ఎస్జె సూర్య ఆఫర్ దక్కించుకున్నాడు. ఒకప్పుడు దర్శకుడిగా వాలి, ఖుషి లాంటి క్లాసిక్స్ ఇచ్చి ఇప్పుడు పూర్తిగా నటుడిగా మారిపోవడం వల్ల ఒక మంచి టెక్నీషియన్ అయితే మిస్ అవుతున్న మాట వాస్తవం. ఇతని రెమ్యునరేషన్ కూడా భారీగా ఉందని చెన్నై టాక్. కాల్ షీట్లు అడిగినా కనీసం ఏడాది వెయిట్ చేయాలనేంత బిజీగా ఉన్నాడట. ఇదే తరహాలో గౌతమ్ మీనన్, కెఎస్ రవికుమార్, భాగ్యరాజా లాంటి వాళ్ళు పూర్తిగా నటన వైపు షిఫ్ట్ అయిపోయి ఎలాంటి టెన్షన్ లేకుండా కాలం గడిపేస్తున్నారు. ట్రెండ్ తో పోటీ పడలేనప్పుడు ఇదే బెస్ట్ ఆప్షన్.