బాలయ్యను భలే వాడుకున్నారే..

రెండేళ్లుగా నందమూరి బాలకృష్ణ ఊపు మామూలుగా లేదు. వరుస డిజాస్టర్ల నుంచి కోలుకుని ‘అఖండ’తో భారీ విజయాన్నందుకున్నాక బాలయ్య కెరీరే మారిపోయింది. ఒకప్పట్లా కథలు, దర్శకుల ఎంపికలో ఆయన పొరపాట్లు చేయట్లేదు. ట్రెండీ డైరెక్టర్లతో జట్టు కడుతూ తన సినిమాలకు మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. గోపీచంద్ మలినేనితో చేసిన ‘వీరసింహారెడ్డి’ సైతం పెద్ద హిట్టయి బాలయ్య మార్కెట్‌ను పెంచింది.

ఇప్పుడు అనిల్ రావిపూడితో బాలయ్య చేస్తున్న ‘భగవంత్ కేసరి’కి కూడా మంచి క్రేజ్ ఉంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం బాలయ్య హవా నడుస్తోందని చెప్పొచ్చు. వేరే సినిమాల్లో బాలయ్య రెఫరెన్సులు కూడా పెరుగుతున్నాయి. ‘జై బాలయ్య’ అనే నినాదం ఇప్పుడెంత పాపులరో అందరికీ తెలిసిందే. తెలుగులో కొత్తగా రిలీజైన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’లో బాలయ్య రెఫరెన్సులు కొంచెం గట్టిగానే ఉండటం విశేషం.

ఇందులో అనుష్క తల్లిగా నటించిన జయసుధను బాలయ్యకు వీరాభిమానిగా చూపించారు. క్యాన్సర్‌తో బాధపడుతూ జీవితం చివరి దశలో ఉన్నప్పటికీ ఆమె డోంట్ కేర్ అనే యాటిట్యూడ్‌తో కనిపిస్తుంది. జయసుధను పరిచయం చేసే తొలి సన్నివేశంలోనే ఫారినర్లకు బాలయ్య సినిమా చూపిస్తూ తెలుగులో డైలాగులు ట్రాన్స్‌లేట్ చేస్తుంటుంది. బాలయ్య డైలాగుల్లో ట్రోల్ మెటీరియల్‌గా మారిన ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్..’ డైలాగ్ సీన్ చూసి ఫారినర్స్ ఏమీ అర్థం కాలేదని వెళ్లిపోతారు.

ఇంకో సీన్లో జయసుధ పుట్టిన రోజు నాడు కళ్లకు గంతలు కట్టి నేరుగా ‘అఖండ’ థియేటర్ దగ్గర దింపుతారు. ఆమె కళ్లు తెరవగానే బాలయ్య కటౌట్ చూసి ఎగ్జైట్ కావడమే కాక.. థియేటర్ లోపల ఒక సగటు అభిమానిలా నానా హంగామా చేస్తుంది. మధ్యలో ఒక చోట జై బాలయ్య నినాదాలు కూడా చేస్తుంది జయసుధ.  ఇక ఆసుపత్రిలో చివరి గడియల్లో కళ్లు మూసుకున్న తన తల్లిని చూసి అనసూయ కంగారు పడితే.. ‘‘పడుకున్నానే పోలేదు. బోత్ ఆర్ నాట్ సేమ్’ అంటూ బాలయ్య డైలాగే చెబుతుంది జయసుధ. ఎమోషనల్ సీన్లలో కూడా బాలయ్య డైలాగ్‌తో ప్రేక్షకుల్లో చిరునవ్వు తెప్పించడం విశేషం. మొత్తంగా ఈ సినిమాలో జయసుధ పాత్ర ద్వారా కాసేపే అయినా బాలయ్యను దర్శకుడు మహేష్ భలేగా వాడుకున్నాడని చెప్పాలి.