రామ్ చరణ్ 17 ప్రచారంలో నిజం లేదు

ఓ రెండు మూడు రోజుల నుంచి రామ్ చరణ్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించబోతున్నాడనే వార్త బాగానే చక్కర్లు కొట్టింది. ఒక బడా బాలీవుడ్ సంస్థ దీని కోసం సంప్రదించిందని, వందల కోట్ల బడ్జెట్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని పెద్ద ప్రచారమే జరిగింది. దీన్ని నిజమే అనుకుని కొన్ని సోషల్ మీడియా పేజీలు ఏకంగా మీమ్స్ కూడా తయారు చేశాయి. లుక్స్ పరంగా కోహ్లీకి చరణ్ కి దగ్గరి పోలికలు ఉంటాయి కాబట్టి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఊదరగొట్టాయి. అయితే అసలు విషయం వేరే ఉంది.

ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే. అసలు విరాట్ కి తన కథను తెరమీద చూసుకోవాలన్న ముచ్చట ఇప్పట్లో లేదట. అందుకే సచిన్, ధోని బయోపిక్ లు నిర్మాణంలో ఉన్నప్పుడు కొందరు నిర్మాతలు తనను సంప్రదిస్తే నిర్మొహమాటంగా నో చెప్పాడని గత ఏడాదే ముంబై పత్రికల్లో వచ్చింది. పైగా కోహ్లీ జీవితంలో సినిమాకు సరిపడా విపరీతమైన డ్రామా లేదు. చాలా కష్టపడి పైకొచ్చాడు కానీ కమర్షియల్ స్కేల్ లో చూపించే అవకాశం తన కథలో చాలా తక్కువ. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు అంత అర్జెంటుగా దీన్ని చూసేయాలని అభిమానులు సైతం కోరుకోవడం లేదు.

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ పూర్తి చేసే టార్గెట్ లో ఉన్న రామ్ చరణ్ ఆ తర్వాత బుచ్చిబాబు కోసం కొంత గ్యాప్ తీసుకుని ఆ టైంలో పూర్తిగా మేకోవర్ చేసుకుంటాడు. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యాక దానికి ఎంతలేదన్నా ఏడాదికి పైనే టైం పడుతుంది. ఇది ఫినిష్ చేసే లోపు ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. లోకేష్ కనగరాజ్ ని ట్రై చేస్తున్నా అతను ఇప్పట్లో దొరికేలా లేడు కాబట్టి ఆర్సి 17కి డైరెక్టర్ ని లాక్ చేసుకోవడం చరణ్ కు సవాలే. ఎందుకంటే స్టార్ దర్శకులు ఎవరూ ఇంకో రెండు మూడేళ్ళ దాకా ఖాళీగా కనిపించడం లేదు.