పైరసీ చేశారు 20 లక్షల ఫైన్ పడింది  

ఇటీవలే సవరణలకు గురై కఠిన ఆంక్షలతో ముందుకొచ్చిన సినిమాటోగ్రఫీ యాక్ట్ లో మొదటి తీర్పు వచ్చేసింది. తాము హక్కులు కొనుగోలు చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివని పైరసీ చేసి ఇల్లీగల్ గా స్ట్రీమింగ్ చేసినందుకు గాను స్టార్ మా నెట్ వర్క్ కోర్టులో కేసు వేసింది. కొన్ని వెబ్ సైట్స్ ని బాధ్యులుగా పేర్కొంటూ ఆధారాలతో సహా న్యాయస్థానానికి సమర్పించింది. ఇవన్నీ పరిశీలించిన జస్టిస్ ప్రతిభ ఎం సింగ్ సదరు మిర్రర్ సైట్లకు అక్షరాలా 20 లక్షల జరిమానా విధిస్తూ జడ్జ్ మెంట్ ఇచ్చేశారు. ముందు 18 సైట్లను పేర్కొన్న స్టార్ ఛానల్ తర్వాత మరికొన్నింటిని జోడించింది.

పైరసీ భూతం దశాబ్దాల తరబడి పరిశ్రమను వేధిస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దొరక్క నిర్మాతలు కోట్లలో నష్టపోతున్నారు. ఇటీవలే జైలర్ థియేటర్లలో రన్ అవుతుండగానే హెచ్డిని లీక్ చేయడంతో హఠాత్తుగా ఓటిటి స్ట్రీమింగ్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవే కాదు కొత్త రిలీజ్ ఏదున్నా సరే మార్నింగ్ షో పడ్డాక సాయంత్రం లోపు మంచి ప్రింట్ తో దాన్ని జనాలకు అందిస్తున్న సైట్లు వందల్లో ఉన్నాయి. విదేశీ సర్వర్ల ద్వారా వీటిని ఆపరేట్ చేయడంతో పట్టుకోవడం దుర్లభంగా మారింది. ఇప్పుడీ పరిణామంతో ఖచ్చితంగా మార్పు ఉంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇలాంటి కేసుల్లో విజయం సాధించాలంటే నిర్మాతకు ఓపిక చాలా అవసరం. అధిక సందర్భాల్లో ఎలాగూ బిజినెస్ అయిపోయింది, డబ్బులు వచ్చేశాయనే నిర్లక్ష్యంతో చాలా మంది ముందుకు రారు. కానీ స్టార్ నెట్ వర్క్ మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. ఇదొక్కటే కాదు టెలిగ్రామ్ లాంటి యాప్స్ లో కోట్లాది సినిమాలు ఉచితంగా పంపిణి చేసే వాళ్ళ భరతం కూడా పడితేనే ఈ చీడకు విరగడ ఉంటుందని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. ఇవన్నీ ఒక్క రోజులో నెలలో అవ్వకపోవచ్చు. సమయం పట్టినా చివరి పరిష్కారం వరకు పోరాడితే ఎందరికో మేలు జరుగుతుంది.