ప్రభాస్ ఒక్కడికే ఇలా ఎందుకు జరుగుతుంది

నిన్న సలార్ వాయిదా వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ప్రభాస్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అఫీషియల్ గా హోంబాలే ఫిలిమ్స్ ఇంకా ప్రకటన ఇవ్వనప్పటికీ డిస్ట్రిబ్యూషన్ వర్గాలకు న్యూస్ రావడం, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అర్ధాంతరంగా ఆపేయడం లాంటివి ఆ ప్రచారానికి బలం చేకూర్చాయి. దెబ్బకు ఇతర నిర్మాతలు అలెర్ట్ అయిపోయి సెప్టెంబర్ 28 తమ సినిమా రిలీజ్ చేసేందుకు గల అవకాశాలను పరిశీలించడం మొదలుపెట్టారు. ఫస్ట్ కాపీ సిద్ధంగా ఆన్న మ్యాడ్ లాంటివి అఫీషియల్ పోస్టర్లు విడుదల చేయగా మరికొన్ని అదే పనిలో బిజీగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా తమ హీరోకే ఎందుకు ఇలా జరుగుతోందని డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. బాహుబలి నుంచి ఇదే తంతు. అది భారీ గ్రాండియర్ కాబట్టి రాజమౌళి కోసం అంత త్యాగం చేసినా దానికి తగ్గ గొప్ప ఫలితం దక్కింది కాబట్టి ఆ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదు. కానీ సాహో, రాధే శ్యామ్ లు లెక్కలేనన్నిసార్లు పోస్ట్ పోన్ అయ్యాయి. సోషల్ మీడియాలో యువి మీద ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో మనకు తెలియంది కాదు. ఆదిపురుష్ సైతం సంక్రాంతి నుంచి జూన్ కు వెళ్లిన బాపతే. ఇంతా చేసి పోనీ ఇవి హిట్టయితే సంతోషమే. కానీ డిజాస్టర్లుగా మిగిలాయి.

సరే పోనీ సలార్ తో మొత్తం సెట్ అయిపోతుందనుకుంటే ఇది కూడా అదే బాట పడుతోంది. ప్లానింగ్ లో మంచి పేరున్న హోంబాలే ఇలా చేయడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీని కోసం ప్రభాస్ చాలా కాల్ షీట్లు ఇచ్చాడు. తగినంత సమయం పోస్ట్ ప్రొడక్షన్ కోసం కేటాయించారు. అయినా సరే మంచి డేట్ ని మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి వివరణ కానీ ప్రెస్ నోట్ కానీ రాకపోవడం మరింత వేడిని రాజేస్తోంది. వేగంగా సినిమాలు చేస్తున్నా రిలీజ్ డేట్ల పంచాయితీలో ప్రభాస్ కు జరుగుతున్నది ముమ్మాటికీ దురదృష్టమే