స్టువర్ట్ పురం వివాదాలు అప్పుడెందుకు రాలేదు  

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా టైగర్ నాగేశ్వరరావు టీజర్ లో ఒక ఊరి మనోభావాలు దెబ్బ తీసేలా డైలాగులు, సన్నివేశాలు పెట్టారని ఒక పిల్ కు సమాధానంగా హై కోర్టు నోటీసులు జారీ చేయడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు మీడియాలోనూ వేడి చర్చ జరుగుతోంది. ఇదంతా స్టువర్ట్ పురం ఊరి గురించేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యాయస్థానం అడిగింది సహేతుకంగా ఉన్నా మూవీలో చూపిస్తోంది పీరియాడిక్ డ్రామా కాబట్టి అప్పట్లో జరిగిన దొంగతనాలు ఆధారంగా చేసుకునే దర్శకుడు వంశీ కథ రాసుకున్నట్టు పలు సందర్భాల్లో చెప్పాడు.

కాసేపు లాంగ్ ఫ్లాష్ బ్యాక్ కు వెళదాం. ముప్పై ఏళ్ళ క్రితం 1991లో చిరంజీవి హీరోగా యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ఆయనే రాసిన నవల ఆధారంగా స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ తీశారు. డిజాస్టరైన సంగతి పక్కన పెడితే అందులో ఆ ఊరిలో ఎలాంటి దొంగలు ఉండేవారో, ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో చూపించారు. అప్పుడూ కొన్ని అభ్యంతరాలు వచ్చాయి కానీ మరీ కోర్టు మెట్లు ఎక్కే దాకా కాదు. అదే టైంలో భానుచందర్ స్టువర్ట్ పురం దొంగలు సైతం ఇదే బ్యాక్ డ్రాప్ తో వచ్చింది. చిరుతో పోలిస్తే ఇది మంచి ఫలితం అందుకుంది. దీన్నీ ఎవరూ తప్పుబట్టలేదు.

కానీ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుకు అబ్జెక్షన్ వచ్చి పడింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని నిర్మాతకు నోటీసు వెళ్ళింది. యూట్యూబ్ ట్రైలర్ అయినా సరే సెన్సార్ ఎందుకు చేయించలేదని ప్రశ్నించింది. సరే లాయర్ ద్వారా ఎలాంటి సమాధానం చెబుతారో ఇంకొద్ది రోజుల్లో తేలుతుంది కానీ సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక ఇష్యూ ఎలాంటిదైనా సరే సున్నితత్వం పెరిగిపోయి మనోభావాలు బాగా దెబ్బ తింటున్నాయి. స్టువర్ట్ పురంలో ఇప్పుడెలాంటి విపత్కర పరిస్థితులు లేవు కానీ ఒకప్పుడు ఉన్నవే కదా చూపిస్తున్నారని అభిమానులు అంటున్నారు. చూడాలి కథ ఇంకా ఏ మలుపులు తిరుగుతుందో.