స్క్రీన్ల సమస్యతో గుడుంబా ముందుకు

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ రీ రిలీజ్ ప్లాన్ చేసుకున్న గుడుంబా శంకర్ ని రెండు రోజులు ముందే అంటే ఆగస్ట్ 31నే థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ మొన్నటి నుంచే రెండో తేదీకి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడితే హైదరాబాద్ క్రాస్ రోడ్స్ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇప్పుడు డేట్ మారడంతో మళ్ళీ ఫ్రెష్ గా కొనడం తప్ప వేరే మార్గం లేదు. ఒకటో తారీఖు విజయ్ దేవరకొండ ఖుషి వస్తున్న నేపథ్యంలో స్క్రీన్ల పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశంతో పాటు పాత సినిమాగా గుడుంబా శంకర్ మీద ఎఫెక్ట్ పడొచ్చనే అభిప్రాయంతో మార్చినట్టున్నారు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. క్రమంగా రీ రిలీజులు థియేటర్ కౌంట్, వసూళ్ల పరంగా కొత్త వాటి మీద బలంగా ప్రభావం  చూపిస్తున్నాయి. వారానికి ఒక్క సినిమా మాత్రమే చూసే బడ్జెట్ ఉన్న మధ్య తరగతి ప్రేక్షకుడు నోస్టాల్జిక్ ఫీలింగ్ కోసం పాత దానికి వెళ్తే ఆటోమేటిక్ గా లేటెస్ట్ రిలీజ్ కు ఓ టికెట్ తగ్గిపోతుంది. ఈ కౌంట్ వందల్లో ఉంటే సమస్య లేదు. వేల నుంచి లక్షల సంఖ్యలో జనాలు ఇలా ఆలోచించినప్పుడు అసలు ముప్పు ముంచుకొస్తుంది. ఏదో వరద ప్రవాహం వచ్చినట్టు ఇన్నేసి వదులుతుంటే ఇలాంటి పరిణామాలే తలెత్తుతాయి.

అసలే పవన్ ఫ్యాన్స్ గుడుంబా శంకర్ కలెక్షన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బిజినెస్ మెన్ ని దాటాలని ఫిక్స్ అయ్యారు. పైగా దీనికొచ్చే నిధులు జనసేనకు వెళ్తాయని నిర్మాత నాగబాబు ప్రకటించడంతో దానికి అనుగుణంగా భారీ ఎత్తున వసూళ్లు అందివ్వాలని ప్లాన్ చేసుకున్నారు. ఇంకో పక్క మన్మథుడు, భైరవ ద్వీపం కూడా రన్ అవుతున్నాయి. రెండు మూడు రోజులు మాత్రమే అయినప్పటికీ బయ్యర్లు మంచి రెస్పాన్సే ఆశిస్తున్నారు. ఇప్పుడున్న స్టార్ హీరోల ఫిల్మోగ్రఫీలో అన్ని సినిమాలు ఓ రౌండ్ పూర్తయితే తప్ప ఈ రీ రిలీజుల ప్రవాహానికి అడ్డుకట్ట పడే సూచనలు కనిపించడం లేదు.