గదర్ 2 చూసి వాత పెట్టుకుంటున్నారు

ఏదో హిట్ అయితే చాలనుకుంటే ఏకంగా బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తున్న గదర్ 2 చూసి ఒక్కసారిగా బాలీవుడ్ దర్శక నిర్మాతల్లో చలనం వచ్చేసింది. సన్నీడియోల్ మీద బడ్జెట్ పెడితే వర్కౌట్ కాదని ఏళ్ళ క్రితమే కథలు రాయడం మానేసిన రచయితలు ఒక్కసారిగా స్టోరీలకు బూజు దులుపుతున్నారు. ముఖ్యంగా ఆయన నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ కి కొనసాగింపులు సిద్ధం చేసే పనిలో పడ్డారు. అందులో మొదటిది బోర్డర్. 1997లో జెపి దత్తా తీసిన ఈ ఇండియా పాకిస్థాన్ వార్ డ్రామా అప్పట్లో అద్భుత విజయాన్ని సాధించింది. ఆ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది.

బోర్డర్ సృష్టికర్త జెపి దత్తా ఇప్పుడు సీక్వెల్ పైన దృష్టి పెట్టారు. కూతురు నిధి దత్తాతో స్క్రిప్ట్ కి ఒక రూపం కల్పిస్తున్నారు. అయితే మొదటి భాగం మల్టీస్టారర్ గా రూపొందింది. సన్నీతో పాటు జాకీ శ్రోఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్ లాంటి ఎందరో హీరోలు భాగమయ్యారు. ఇప్పుడు 1971 యుద్ధ నేపధ్యాన్ని తీసుకుని బోర్డర్ 2 తీయాలనే ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు ఘాయల్, ఘాతక్, దామిని, సలాకే, అర్జున్, ఆప్నే లాంటి  హిట్లని కంటిన్యూ చేద్దామని సన్నీ డియోల్ కు ఫోన్ చేస్తున్నారట సదరు ప్రొడ్యూసర్లు. ఇటీవలే కొడుకు పెళ్లి చేసి గదర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ లేట్ ఏజ్ హీరోకిది అనూహ్యమే.

అయినా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు గదర్ 2 విజయం వెనుక బోలెడు కారణాలున్నాయి. పాటలు, బలమైన యాంటీ పాక్ సెంటిమెంట్, డైలాగులు వర్కౌట్ అయ్యాయి. అంతే తప్ప కేవలం సన్నీ డియోల్ చేశాడని కాదు. అది మర్చిపోయి హఠాత్తుగా వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుందామనే ఉద్దేశంతో ఇలా తొందరపడితే చేతులు కాల్చుకోవడం ఖాయం. పఠాన్ తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన గదర్ 2 వల్ల నార్త్ బాక్సాఫీస్ లో ఉత్సాహం వచ్చిన మాట వాస్తవమే కానీ దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయి సీక్వెల్స్ వర్షం కురిపిస్తామంటే మాత్రం దెబ్బ తినక తప్పదు.