వైష్ణవి కబుర్లు కనిపించడం లేదేంటి

పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య రెండు మూడు వారాల పాటు సోషల్ మీడియాలో, ఆ సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో బాగా హైలైట్ అవుతూ ప్రేక్షకుల దృష్టిలో గట్టిగానే పడింది. టైటిల్ కు పూర్తి న్యాయం చేకూరుస్తూ తన పెర్ఫార్మన్స్ తో బెస్ట్ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ఊసులు ఎక్కడా కనిపించడం లేదు. ఎస్కెఎన్ తోనే మరో రెండు ప్రాజెక్టులకు సంతకం చేసిందనే టాక్ వచ్చింది కానీ అసలు వాటికి కథలే సిద్ధంగా లేవట. స్టోరీ లేనప్పుడు డైరెక్టర్ ని ఎక్కడ నుంచి తెస్తారు. సో టైం పట్టొచ్చని తెలిసింది.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు శిరీష్ హీరోగా రూపొందబోయే మరో సినిమాలో కథానాయికగా వైష్ణవి పేరే పరిశీలనలో ఉందట. ఇంకో ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో డెబ్యూ కోసం ఎదురు చూస్తున్న ఇదే కాంపౌండ్ కు చెందిన మరో దర్శకుడు సైతం ఈమె అంగీకారం కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. అయితే వైష్ణవి డైలమాలో ఉందట. బేబీ ఇంత గొప్ప విజయం సాధించినా తనకు బడా బ్యానర్ల నుంచి పిలుపు రాలేదు. స్టార్ హీరోలు ఒక ఆప్షన్ గా పెట్టుకోవడం లేదు. ఇంకో పెద్ద బ్రేక్ ఏదైనా వస్తే తప్ప కెరీర్ స్పీడ్ అందుకునేలా లేదు. బేబీలో చేసిన పాత్ర స్వభావం ప్రభావం చూపించినట్టే ఉంది.

టాలీవుడ్ లో పరిస్థితి ఎలా ఉందంటే రష్మిక మందన్నలాగా యూత్ ఫుల్ ప్లస్ గ్లామర్ ఎంట్రీ జరగాలి ఛలో లాగా. లేదూ పూజా హెగ్డే లాగా ముకుంద లాంటి స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కొత్త హీరో సరసన నటించాలి. కానీ వైష్ణవికి ఈ రెండు జరగలేదు. ఆనంద్ దేవరకొండ ఇంకా అప్ కమింగ్ స్టేజిలోనే ఉన్నాడు. విరాజ్ అశ్విన్ కు బేబీ వల్ల జరిగిన మేలు తక్కువే. ఇంకో వైపు సాయిరాజేష్ మరో యూట్యూబ్ స్టార్ దేత్తడి హారికతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారట. కాకపోతే డైరెక్షన్ చేయకుండా కలర్ ఫోటోలాగా రచన ప్లస్ నిర్మాణానికి పరిమితమవుతాడని టాక్. చూడాలి మరి వైష్ణవికి ఎలాంటి ఆఫర్లు వస్తాయో.