అన్ని వేళ్లూ చిరు వైపే..

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో డిజాస్టర్లు లేవని కాదు. ప్రతి హీరోకూ ఉన్నట్లే ఆయనకూ కెరీర్లో కొన్ని చేదు అనుభవాలున్నాయి. ఐతే ‘ఆచార్య’ సినిమాకు వచ్చిన ఫలితం చూసి.. ఆయన కెరీర్లో ఇదే ‘లో’ అని చాలామంది అనుకున్నారు. రెండో రోజు నుంచే థియేటర్లు వెలవెలబోవడం.. చిరు కెరీర్లోనే అత్యధిక నష్టాన్ని తెచ్చిపెట్టడంతో చిరు కెరీర్లో ఇంతకంటే పతనం మరొకటి లేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. చిరు కెరీర్లో ఇంకెప్పటికీ ఇలాంటి తప్పు జరగదని.. ఇంతకంటే ‘లో’ ఆయన చూడలేరనే అనుకున్నారు.

కానీ ‘భోళా శంకర్’.. ‘ఆచార్య’ను మించిన చేదు అనుభవం కాబోతోందని స్పష్టమైపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల అనాసక్తి అర్థమైపోయింది. ఇక టాక్ దారుణంగా రావడంతో సినిమా ఏ దశలోనూ పుంజుకునే అవకాశం లేదనీ అర్థమైపోయింది. రూ.80 కోట్ల షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఈ చిత్రం.. అందులో సగం కూడా రాబట్టే అవకాశం లేదని తేలిపోయింది.

‘ఆచార్య’ సినిమా ఫలితం విషయంలో అందరి వేళ్లూ దర్శకుడు కొరటాల శివ వైపే వెళ్లాయి. చిరంజీవి సైతం పరోక్షంగా కొరటాలనే తప్పుబట్టారు. ఐతే ‘ఆచార్య’ అనేది ఒక మిస్ ఫైర్. వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్లు తీసిన దర్శకుడి నుంచి ఇలాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. చిరు సహా అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని కొరటాల నిలబెట్టుకోలేకోయారు. ఈ ఫెయిల్యూర్ తాలూకు ప్రధాన బాధ్యత తీసుకోవాల్సింది కొరటాలనే. చిరు కొరటాలను టార్గెట్ చేస్తున్నట్లు మాట్లాడటం తప్పే అయినా సరే.. ఆయన అసహనంలో కొంత న్యాయం ఉన్నట్లే అనిపించింది.

కానీ ‘భోళా శంకర్’ విషయానికి వస్తే మాత్రం దీని ఫెయిల్యూర్‌కు ప్రధాన బాధ్యత తీసుకోవాల్సింది చిరునే అని చెప్పాలి. ఎందుకంటే శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు తీసి పదేళ్లుగా సినిమాలు చేయని మెహర్ రమేష్‌కు ఛాన్స్ ఇవ్వడం అతి పెద్ద తప్పిదం. అందులోనూ అభిమానులు వద్దు మొర్రో అన్నా సైరే.. ‘వేదాళం’ లాంటి రొటీన్ మాస్ సినిమాను రీమేక్ చేయాలనుకోవడం ఇంకో పెద్ద తప్పు. ఈ సినిమా ఆడదు అనే విషయం సినిమా అనౌన్స్ చేసినపుడే చాలామంది అంచనా వేసేశారు. టీజర్.. ట్రైలర్ చూశాక డిజాస్టర్ అని తీర్మానించేశారు. కాబట్టి ‘ఆచార్య’ అనేది తెలియక జరిగిన తప్పు అయితే.. ‘భోళా శంకర్’ అనేది తెలిసి తెలిసి చేసిన అతి తప్పు అనడంలో మరో మాట లేదు. అందుకే చిరునే అందరూ తప్పుబడుతున్నారిప్పుడు.