కొత్త ట్రోలింగుకి భయపడ్డ ఆదిపురుష్ దర్శకుడు

చెప్పాపెట్టకుండా, ఎలాంటి హడావిడి చేయకుండా నిన్న ఆగస్ట్ 11 అర్ధరాత్రి నుంచి ఆదిపురుష్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేయడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. ఆరు వందల కోట్ల బడ్జెట్ తో తీసిన గ్రాండియర్ కాబట్టి  సోషల్ మీడియాలో భారీ పబ్లిసిటీ ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ అదేమీ జరగలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలు ప్రైమ్ లో రాగా ఒక్క హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చారు. అన్నీ ఒకే సమయంలో అందుబాటులోకి వచ్చాయి. ఇలా సైలెంట్ గా రిలీజ్ చేయడానికి కారణాలు కోణాలు ఉన్నాయి.

వాటికన్నా ముందు చెప్పాల్సిన పాయింట్ మరొకటి ఉంది. ప్రైమ్ లో ఆదిపురుష్ వచ్చింది చూడమని ట్వీట్ చేసిన దర్శకుడు ఓం రౌత్ దాని కింద కామెంట్స్ సెక్షన్ ని డిజేబుల్ చేశారు. ఆయన అంగీకరించిన స్నేహితులు, ఫాలోయర్లు తప్ప ఎవరూ మెసేజ్ పెట్టలేరు. ఇది ట్రోలింగ్ ప్రభావమే. థియేటర్లలో రిలీజైనప్పుడే విపరీతమైన విమర్శలకు గురైన ఆదిపురుష్ కి ఇంకా కోర్టు గొడవలు తీరిపోలేదు. అరకొర కేసులు నడుస్తూనే ఉన్నాయి. వాటి మీద అతి దగ్గరలో ఎంతో కొంత స్టే వచ్చే ప్రమాదం ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా ఓటిటిలో వదిలేశారని ముంబై వర్గాల కథనం.

పైగా ఇప్పుడు హెచ్డి ప్రింట్ తో ఆదిపురుష్ దొరికింది కాబట్టి సహజంగానే సీన్లు, వీడియోలతో యాంటీ ఫ్యాన్స్ విరుచుకుపడతారు. దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేకపోయినా అనవసర టాపిక్స్ కి వైరల్ కావడానికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అయినా తాను తీసిన కంటెంట్ మీద అంత నమ్మకంగా ఉన్నప్పుడు ఓం రౌత్ కామెంట్స్ ని ఓపెన్ గా పెట్టి ఉండాల్సిందని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. అయినా జరిగిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజాలు ఎందుకని రెండు నెలల క్రితం వచ్చి వెళ్ళిపోయిన సినిమాకి చర్చ అవసరం లేదు కానీ ట్రోలింగే పనిగా పెట్టుకున్న బ్యాచులు ఊరికే ఉండవుగా.