చిరును కలిస్తే చాలనుకుంటే..

మెగాస్టార్ చిరంజీవిని ఒక్కసారి కలిస్తే చాలనుకున్న తనకు ఆయనతో సినిమా నిర్మించే అవకాశం దక్కడం ఊహించని అదృష్టమే అంటున్నాడు ‘భోళా శంకర్’ నిర్మాత అనిల్ సుంకర. ఈ అవకాశం తనకు ఎలా దక్కిందో ‘భోళా శంకర్’ రిలీజ్ ముంగిట మీడియాతో ముచ్చటించిన సందర్భంగా అనిల్ వెల్లడించాడు. ‘‘నేను సినిమాలు నిర్మించే సమయానికి చిరంజీవి గారు సినిమాలు వదిలేసి.. రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఆయనతో సినిమా చేయడం అనే ఆలోచన కూడా ఎప్పుడూ మనసులో మెదలలేదు.

నేను మహేష్ బాబుతో ప్రొడ్యూస్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి గారిని ఆహ్వానించడానికి ఆయన దగ్గరికి వెళ్లాను. ఆ సందర్భంగా ఆయన్ని ఎప్పట్నుంచో కలవాలని ప్రయత్నిస్తున్న విషయం చెప్పాను. అందుకాయ.. ‘కలవడం ఏంటి.. మనం కలిసి సినిమా కూడా చేద్దాం’ అన్నారు. ఆయన అన్న మాట అలా మనసులో ఉండిపోయింది. తర్వాత నేను ‘వేదాళం’ కన్నడ రీమేక్ హక్కులు తీసుకున్నా. అక్కడ ఓ స్టార్ హీరోతో సినిమా చేయడానికి చూస్తున్న సమయంలో మెహర్‌తో మాట్లాడాను. మేమిద్దరం ‘వేదాళం’ను తెలుగులో చిరంజీవి గారితో చేస్తే ఎలా ఉంటుందని చర్చించుకున్నాం.

అంతకుముందే మెహర్ ఈ విషయం చిరుతో మాట్లాడారట. ఆయనకీ ఈ కథ బాగా నచ్చడంతో మేం ముగ్గురం మాట్లాడుకుని సినిమాను ముందుకు తీసుకెళ్లాం’’ అని అనిల్ తెలిపాడు. ‘భోళా శంకర్’ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేసిన అనిల్.. ‘ఏజెంట్’ సినిమా తనకు పెద్ద పాఠం నేర్పిందని..  ఇప్పుడు స్క్రిప్టు పక్కాగా రెడీ అయితే తప్ప ఏ సినిమానూ ముందుకు తీసుకెళ్లట్లేదని చెప్పాడు. తమ సంస్థ నుంచి దాదాపు పది సినిమాలు ప్లానింగ్‌లో ఉన్నప్పటికీ.. ఏదీ ఇంకా మొదలు కాలేదని.. అంతా పక్కా అనుకున్నాకే అవి మొదలవుతాయని ఆయన తెలిపాడు.