మోత మోగిపోతున్న రజినీ డైలాగ్

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘జైలర్’ మరి కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చాలా ఏళ్ల నుంచి రజినీ నుంచి సరైన సినిమా రాకపోవడంతో ఆయన క్రేజ్, మార్కెట్ తమిళంలోనే కాక తెలుగులోనూ బాగా దెబ్బ తింది. కానీ ‘జైలర్’ సినిమా మాత్రం మంచి క్రేజే తెచ్చుకుంది. ఇందుకు పాటలతో పాటు ట్రైలర్ ప్రధాన కారణం. కొన్ని రోజుల కిందటే ‘జైలర్’ ఆడియో వేడుకలో చెన్నైలో అట్టహాసంగా జరగ్గా.. అక్కడ్నుంచే హైప్ మరో స్థాయికి వెళ్లింది.

ఆ వేడుకలో రజినీ చేసిన సుదీర్ఘ ప్రసంగం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నో జీవిత సత్యాలు చెబుతూ.. పరోక్షంగా కొందరి మీద కౌంటర్లు వేస్తూ ఆయన తన ప్రసంగంతో ఆహూతులను ఉర్రూతలూగించారు. ఈ ఆడియో వేడుక ఇప్పుడు సన్ టీవీలో ప్రసారం అవుతోంది. అందులోంచి బిట్లు బిట్లుగా వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.

వాటన్నింట్లోకి రజినీ తన మార్క్‌ పంచ్‌తో చెప్పిన ఒక సూక్తి సోషల్ మీడియాను ఊపేస్తోంది. ‘‘మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండు జరగని ఊరు లేదు.. మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి’’ అని రజినీ తమిళంలో పేర్కొన్నాడు. దీనికి కొనసాగింపుగా ఆయన ‘‘అర్థమైందా రాజా’’ అని తెలుగులో ఆఖరి పంచ్ విసరడం విశేషం. ‘హుకుం’ తమిళ పాటలో ఉన్న మాటే ఇది. ఈ హుక్ లైన్ పట్టుకుని ఆడియో వేడుకలో రజినీ అదిరిపోయే పంచ్‌లు వేశాడు. ఇక పై డైలాగ్‌ను రజినీ అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా అన్వయించుకుంటున్నారు.

తమిళ ఫిలిం ఇండస్ట్రీలో తనను విమర్శించే వాళ్లకు.. టార్గెట్ చేసే వేరే హీరోల ఫ్యాన్స్‌కు రజినీ కౌంటర్ ఇదని కొందరంటుంటే.. మన తెలుగు నెటిజన్లేమో.. కొన్ని నెలల కిందట ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో చంద్రబాబును పొగిడినందుకు తనను టార్గెట్ చేసిన వైసీపీ వాళ్లకు రజినీ సమాధానం ఇదని అన్వయించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ.. ఈ షార్ట్ వీడియో మాత్రం ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల్లో రెండు రోజుల నుంచి తెగ తిరిగేస్తోంది.