ఏజెంట్ వివాదం భోళాను ఆపగలదా

ఇంకో నలభై ఎనిమిది గంటల్లో మొదటి ప్రీమియర్ పడాల్సిన భోళా శంకర్ మెడకు ఏజెంట్ వివాదం చుట్టుకోవడం ఫ్యాన్స్ కి టెన్షన్ కలిగిస్తోంది. వైజాగ్ కు చెందిన సతీష్ అనే డిస్ట్రిబ్యూటర్ తనకు ఏజెంట్ సినిమాని ముప్పై కోట్లకు అమ్మి కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే ఇచ్చారని, తర్వాత సామజరగమన విషయంలో ఇలాగే చేసి చివరికి భోళా శంకర్ ఒక్క ఏరియా కూడా తనకివ్వకుండా వేరే వాళ్ళ ద్వారా పంపిణి చేయడం వల్ల తీవ్ర నష్టం వచ్చిందని నిన్నో ప్రెస్ నోట్ వదిలారు. ఇవాళ లాయర్ సమక్షంలో ఒక వీడియో బైట్ కూడా ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడీ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కింది, తనకు న్యాయం జరిగే దాకా భోళా శంకర్ రిలీజ్ మీద స్టే డిమాండ్ చేస్తున్నారు సతీష్. మరోవైపు అనిల్ సుంకర బృందం మాత్రం అతనివి ఫేక్ డాక్యుమెంట్లనే రీతిలో ఆరోపణలు చేసినట్టుగా వచ్చిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలే ఆశించిన స్థాయిలో బజ్ లేదని తెగ ఫీలవుతున్న అభిమానులకు ఈ సంఘటనలు మింగుడు పడటం లేదు. ఏకె ఎంటర్ టైన్మెంట్ యుద్ధప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నైజామ్ అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల క్రితమే మొదలుకాగా ఏపి బయ్యర్లు ఆన్ లైన్ అమ్మకాలకు రెడీ అవుతున్నారు.

న్యాయస్థానం స్టే ఇవ్వొచ్చా లేదానేది సతీష్ సమర్పించే సాక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది. అల్ట్రా డిజాస్టర్ గా నిలిచిన ఏజెంట్ ప్రభావం అదే సంస్థ నుంచి వస్తున్న భోళా శంకర్ మీద ఉండొచ్చనే అనుమానం గతంలోనే వ్యక్తమయ్యింది. దానికి తగ్గట్టే ఇప్పుడీ వివాదం వచ్చి పడింది. జడ్జ్ మెంట్ ఈ రోజుకి రాకపోతే వాయిదా వేసినా రేపయినా ఖచ్చితంగా ఇవ్వాలి. వ్యవహారం ఫిలిం ఛాంబర్ దాకా తీసుకెళ్లినా లాభం లేకపోయిందని చెబుతున్న సతీష్ కు కౌంటర్ గా అనిల్ సుంకర్ బృందం ఇంకా స్పందించలేదు. రాబోయే గంటల్లో పరిణామాలు అత్యంత కీలకంగా ఉండబోతున్నాయి.