1200 మంది లాయర్లు సుప్రీంకు రాసిన లేఖలో ఏముంది?

సీనియర్ న్యాయవాదిగా సుపరిచితుడు ప్రశాంత్ భూషన్ పై ఇటీవల కోర్టు ధిక్కార నేరాన్ని తేల్చటమే కాదు.. ఆయన్ను దోషిగా పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీరుపై తాజాగా న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. సుప్రీం ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేస్తున్న వారు.. అత్యున్నత ధర్మాసనానికి బహిరంగ లేఖ ఒకటి రాసిన వైనం ఆసక్తికరంగా మారింది.

ఇంతకీ ఆ లేఖలో ఏముంది? ఇంతకూ ఆ లేఖను రాసిన 1200 మందిలో ఏ స్థాయి ప్రముఖులు ఉన్నారు? అన్నది కూడా కీలకమని చెప్పాలి. సుప్రీంకు లేఖ రాసిన వారిలో మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ ఖంబాటా.. సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే తో పాటు పలువురు సీనియర్లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు విడుదల చేసిన లేఖలో కొన్ని అంశాల్ని కాస్తంత ఘాటుగానే ఉన్నాయని చెప్పక తప్పదు.

న్యాయవాదుల మౌనం బలమైన న్యాయవ్యవస్థను నిర్మించలేదన్న ఆయన.. కోర్టు దిక్కారం పేరుతో న్యాయవాదుల నోళ్లను మూయటం సరికాదన్న మాట ఇప్పుడు అందరిని చూపు ఆ లేఖ మీద పడేలా చేసిందని చెప్పాలి. స్వతంత్ర న్యాయవ్యవస్థలో స్వతంత్ర న్యాయమూర్తులు.. స్వతంత్ర న్యాయవాదులు ఉంటారని గుర్తు చేశారు.

అదే లేఖలో..ఇద్దరి మధ్య పరస్పర గౌరవం.. చక్కటి వాతావరణం ఉండాలని కోరారు. బార్.. బెంచ్ మధ్య సమతూకం కోల్పోతే అది దేశానికే ప్రమాదకరమన్న హెచ్చరిక ఈ లేఖలో అంతీర్లనంగా దాగి ఉందని చెప్పాలి. కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ భూషణ్ కు దన్నుగా నిలుస్తూ 1200 మంది వరకు రాసిన ఈ లేఖ తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మార్చింది. దీనిపై సుప్రీం ధర్మాసనం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.