థియేటర్లో రికార్డింగ్ చేస్తే భయపెట్టే శిక్షలు

సగటు అభిమానులకు థియేటర్లో స్మార్ట్ ఫోన్ కెమెరా పెట్టుకుని తమకు ఇష్టమైన సీన్లు, పాటలు రికార్డు చేసుకోవడం పరిపాటి. ముఖ్యంగా బెనిఫిట్ షోలలో ఈ అరాచకం మాములుగా ఉండదు. నిజానికి ఇలా చేయడం నిషేధం. మల్టీప్లెక్సుల యాజమాన్యాలు కొంత వరకు కట్టడి చేయగలుగుతున్నాయి కానీ పూర్తిగా కాదు. ఇక సింగల్ స్క్రీన్ల సంగతి సరేసరి. కానీ ఇకపై ఇలా రికార్డు చేసేటప్పుడు చట్టాన్ని దృష్ఠిలో ఉంచుకోక తప్పదు. ఎందుకంటే ఇవాళ రాజ్యసభ కీలక బిల్లుని పాస్ చేసింది. సినిమాటోగ్రఫీ బిల్లులోకి కొన్ని కీలక సవరణలు తీసుకొస్తూ ఆమోదం ఇచ్చింది.

దాని ప్రకారం ఇకపై థియేటర్లో ఏ రూపంలో అయినా కెమెరాతో రికార్డింగ్ చేయడం శిక్షార్హం. ఒకవేళ దీన్ని మీరితే మూడేళ్ళ జైలుశిక్షతో పాటు నిర్మాణం ఖర్చులో 5 శాతాన్ని కట్టాల్సి ఉంటుంది. అంటే అయిదు కోట్లలో తీసిన ఒక సినిమాను రికార్డు చేస్తే 25 లక్షలు ఫైన్ పడుతుందన్న మాట. ఇది నిజంగానే వణికించే విషయమే. అయితే హాలుకు వచ్చే వందలాది ఆడియన్స్ లో ఒకరో ఇద్దరో చేస్తే పట్టుకోవచ్చు కానీ అందరూ తెగబడినప్పుడు నలుగురైదురు సెక్యూరిటీతో వాళ్ళను పట్టుకోవడం జరగని పని. కాకపోతే థియేటర్ బయట బోర్డు పెట్టడం ద్వారా ముందే హెచ్చరిక ఇవ్వొచ్చు

దీని తాలూకు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. అయితే దీని వల్ల పైరసీకి అడ్డుకట్ట పడుతుందా అంటే చెప్పలేం. ఎందుకంటే అధిక శాతం ఈ భూతం విదేశాల నుంచి వస్తోంది. అక్కడి చట్టాలను అడ్డం పెట్టుకుని వాటి సృష్టికర్తలు దొరక్కుండా తప్పించుకుంటున్నారు. అందుకే నిర్మాతలు సైతం ఏమి చేయలేని నిస్సహాయతలో మిగిలిపోయారు. ఇప్పుడీ బిల్లు వల్ల సామాన్యులు జాగ్రత్తగా ఉంటారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే పోలీస్ కేస్ అవుతుందని తెలిసినపుడు తాత్కాలిక ఆనందం కోసం రికార్డింగ్ ఎందుకు చేస్తారు. దీని వల్ల సోషల్ మీడియా గోల కూడా తప్పొచ్చు.