త్రివిక్రమ్ క్లాస్ బండ్ల మాస్ రెండూ మిస్సయ్యాయి  

బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా బాగానే జరిగింది కానీ నిన్న ఉదయం నుంచి ప్రచారం జరిగినట్టు బండ్ల గణేష్ రాలేదు. వాస్తవానికి  ఆహ్వానం వెళ్లిందని, అంగీకారం కూడా తెలిపారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మధ్యాహ్నం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి అఫీషియల్ పోస్టర్ కూడా వచ్చింది. కానీ చివరి క్షణంలో నిర్ణయం ఎందుకు మారిందో తెలియదు కానీ ఆయన స్పీచ్ ఉంటుందని ఎదురు చూసిన ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. పవర్ స్టార్ గురించి గూస్ బంప్స్ ఇచ్చేలా మాట్లాడ్డంలో బండ్లన్న తర్వాతే ఎవరైనా. ఎలివేషన్లు మాములుగా ఉండవన్న సంగతి తెలిసిందే.

సరే బండ్ల మాస్ మిస్ అయ్యింది త్రివిక్రమ్ క్లాస్ అయినా వినొచ్చు అనుకుంటే అదీ జరగలేదు. భీమ్లా నాయక్ లాగే దీనికి గురూజీ దూరంగా ఉన్నారు. స్క్రీన్ ప్లే, మాటల రచయితగా వచ్చి ఉండాల్సిందని మూవీ లవర్స్ అనుకున్నారు కానీ గుంటూరు కారం ఒత్తిడిలో ఉన్న త్రివిక్రమ్ వేరే విషయాల పట్ల దృష్టి పెట్టే పరిస్థితిలో లేరు. పైగా మహేష్ బాబు లేని చైల్డ్ ఎపిసోడ్స్, రమ్యకృష్ణ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. అందుకే తప్పని పరిస్థితిలో తప్పుకోవాల్సి వచ్చిందని సితార వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. దీనికి సంబంధించి మరో కారణం ఉంది.

ఒకవేళ త్రివిక్రమ్ హాజరైతే ఆయనే ఎక్కువ హైలైట్ అయ్యే అవకాశం ఉంది . అది సముతిరఖని లేనిపోని ఇబ్బంది తెచ్చి పెడుతుంది. దాని బదులు అసలు రాకపోతే ఏ సమస్యా లేదు. పవన్ స్పీచ్ లో తన మిత్రుడి ప్రస్తావన ప్రత్యేకంగా తీసుకొచ్చి మరీ పొగిడారు కాబట్టి రాకపోయినా వచ్చినట్టే. వీళ్ళే కాదు హరీష్ శంకర్, క్రిష్, మైత్రి రవి -నవీన్, నాగబాబు వీళ్ళెవరూ కనిపించలేదు. ఎలాగూ లేట్ అవుతోంది కాబట్టి గెస్టులను తగ్గించుకోవడమే మంచిదయ్యిందనే కామెంట్లో నిజం లేకపోలేదు. అందరూ వచ్చి వుంటే ఏ అర్ధరాత్రో అపరాత్రో అయిపోయి సమయం చేదాటిపోయేది.