ఒక్కడు దర్శకుడు హర్ట్ అయ్యారు

చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్లకు ఒక్కడు, చూడాలని ఉంది లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కు హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. కాకపోతే ఒకప్పటి ఆయన క్రియేటివిటీ స్థాయిలో కాకుండా సినిమాలు తీస్తుండటంతో ఫ్లాపులు పడుతున్నాయి. ముఖ్యంగా కొండంత ఆశలు పెట్టుకున్న శాకుంతలం అంత దారుణంగా డిజాస్టర్ కావడం ఎవరూ ఊహించనిది. కనీసం యావరేజ్ అనిపించుకున్నా కొంత ఊరట ఉండేది కానీ నిర్మాత దిల్ రాజే తన కెరీర్ లో ఇంత నష్టం చూడలేదని చెప్పడం గాయం మీద కారమే అయ్యింది.

గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ హిరణ్యకశిప. రుద్రమదేవి టైంలోనే రానాతో తీయాలని ప్లాన్ చేసుకున్నారు. సురేష్ సంస్థలో వంద కోట్లకు పైగా బడ్జెట్ ప్రతిపాదన కూడా పెట్టారు. కానీ నిర్మాణ వ్యయం ఎక్కువనిపించడంతో పెండింగ్ లో ఉండిపోయింది. ఈలోగా రకరకాల పరిణామాలు జరిగి గుణశేఖర్ శాకుంతలం తీయడం, అది తీవ్రంగా నిరాశ పరచడం జరిగాయి. నిన్న రానా ఇదే సబ్జెక్టుతో అమర్ చిత్ర కథ నుంచి ఎంచుకున్న కాన్సెప్ట్ తో తీయబోతున్నానని అనౌన్స్ చేయడం షాక్ ఇచ్చింది. అది కూడా త్రివిక్రమ్ రచనలో. డైరెక్టర్ ఎవరో చెప్పలేదు. దీంతో సహజంగానే గుణశేఖర్ మనస్థాపం చెందారు.

మనం చేసేవాటిని దేవుడు చూస్తుంటాడని, అనైతికమైన పనులకు నైతిక చర్యల ద్వారా సమాధానం వస్తుందని హిరణ్య కశిప పనుల మీద ఉన్నప్పటి ఫోటోలను షేర్ చేసి ట్వీట్ చేశారు. ఇది ఎవరిని ఉద్దేశించినదో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ శాకుంతలం బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఇప్పుడీ పరిమాణం జరిగేది కాదన్న కామెంట్లో నిజం లేకపోలేదు. సక్సెస్ మీదే నడిచే ఇండస్ట్రీలో ఎంత పెద్ద దర్శకుడైనా సరే హిట్లు లేకపోతే ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయక తప్పదు. మాములుగా ఇలాంటి వ్యవహారాలు తేలిగ్గా వదలనని చెప్పే గుణశేఖర్ ఈసారి మౌనంగా ఉంటారో లేక పోరాడతారో చూడాలి.