బిచ్చగాడి మీద భారం వేసిన హత్య

తెలుగు రాష్ట్రాల్లో విజయ్ ఆంటోనీ క్రేజ్ పెద్దగా లేకపోయినా బిచ్చగాడు బ్రాండ్ వేల్యూ మాత్రం చాలా పెద్దది. ఎంతగా అంటే ఆ మధ్య సీక్వెల్ రిలీజైతే ఒరిజినల్ తమిళనాడు కన్నా ఏపీ తెలంగాణలో కలెక్షన్లు ఎక్కువొచ్చాయి. దెబ్బకు అతను టీమ్ తో సహా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండిపోయి విస్తృతంగా ప్రమోషన్లు చేసుకున్నాడు. సీక్వెల్ కూడా ప్లానింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా ఇతని కొత్త సినిమా హత్య వచ్చే వారం జూలై 21 విడుదలకు రెడీ అవుతోంది. సురేష్, ఏషియన్ సంస్థలు సంయుక్తంగా అందించబోతున్నాయి. థియేటర్లు కూడా గట్టిగానే ప్లాన్ చేశారట.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన హత్య నెలల క్రితమే పూర్తయ్యింది. ఏవో కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ వచ్చారు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటి రాధికా కీలక పాత్ర పోషించారు. అప్పుడెప్పుడో ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు చిన్న టీజర్ లాంటిది వదిలి హడావిడి చేశారు కానీ ఆ తర్వాత పూర్తిగా వదిలేశారు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహించగా గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం అందించారు. మురళి శర్మ లాంటి తెలుగు నటులు కూడా ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ తక్కువ టైంలో హైప్ తీసుకురావడం పెద్ద సవాలే.

సోమవారం నుంచి విజయ్ ఆంటోనీ మళ్ళీ హైదరాబాద్ వచ్చి హత్యను ప్రమోట్ చేసుకోబోతున్నాడు. చేతిలో కేవలం ఆరు రోజులు మాత్రమే ఉంది. ఆపై 28న పవన్ కళ్యాణ్ బ్రో వచ్చేస్తుంది కాబట్టి వీలైనంత రాబట్టుకుని సేఫ్ అవ్వాలి. మొత్తం థియేటర్లన్నీ దానికే ఇవ్వకపోయినా జనాల దృష్టి బ్రో మీదే ఉంటుంది. హత్యకు పాజిటివ్ టాక్ వస్తే ఇబ్బంది లేదు కానీ ఏ మాత్రం అటుఇటు అయినా లెక్కలు మారిపోతాయి. బిచ్చగాడు పేరుతో ఏళ్ళ తరబడి తెలుగు డబ్బింగులు బిజినెస్ చేస్తున్న విజయ్ ఆంటోనీకి అది తప్ప వేరే సినిమా హిట్ అయిన దాఖలాలు లేకపోవడం అసలు ట్విస్టు.