శంకర్ ఇలా చేయడం మొదటిసారేమో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ తాలూకు కీలక షెడ్యూల్ కి రంగం సిద్ధమయ్యింది. కూతురు క్లింకార ఆగమనాన్ని మనసారా ఎంజాయ్ చేసిన చరణ్ హైదరాబాద్ సెట్లో కాలు పెట్టబోతున్నాడు. యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వీటి పర్యేవేక్షణతో పాటు సెకండ్ యూనిట్ కు సంబంధించిన వ్యవహారాలు హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలనుకి ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మాములుగా ఇదేమి పెద్ద విషయం కాకపోయినా శంకర్ లాంటి పర్ఫెక్షననిస్టులు ఈ పద్ధతి ఫాలో కారు.

కానీ ఇండియన్ 2 కోసం ఒత్తిడిలో ఉన్న శంకర్ కు వేరొకరికి తాత్కాలికంగా అయినా సరే బాధ్యతలు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే శైలేష్ కొలనుని నిర్మాత దిల్ రాజు రికమండేషన్ తోనే రంగంలోకి దించారట. వెంకటేష్ సైంధవ్ తో బిజీగా ఉన్న శైలేష్ వీలును బట్టి అవసరాన్ని బట్టి గేమ్ ఛేంజర్ లో భాగమవుతున్నాడు. ఇప్పటికే విపరీతమైన ఆలస్యానికి గురైన ఈ సినిమా విడుదల విషయంలో ఫ్యాన్స్ అసహనంగా ఉన్నారు. 2024 సంక్రాంతి,వేసవి రెండు సీజన్లు మిస్ చేసుకుంటే మళ్ళీ దసరా దాకా ఎదురు చూడాల్సి వస్తుంది.

దానికన్నా ముందే రావాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ 2 సమ్మర్ కన్నా ముందే రాదని నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ ఇటీవలే చెప్పేశాడు కాబట్టి అది పొంగల్ బరి నుంచి తప్పుకున్నట్టు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. అయితే మరో ఆ స్లాట్ లో గేమ్ ఛేంజర్ ని తీసుకురావాలన్న ఆలోచన ఉంది కానీ ఇప్పుడున్న అతి తక్కువ టైంలో పోస్ట్ ప్రొడక్షన్లు, ప్రమోషన్లు ఇవన్నీ అంత సులభంగా జరిగేవి కాదు. ఏది ఏమైనా  ఇండియన్ 2 వల్ల శంకర్ ఎక్కువ దాని మీదే ఫోకస్ పెట్టడం, గేమ్ చేంజర్ తాలూకు అప్డేట్స్ గురించి పట్టించుకోకపోవడం ఫ్యాన్స్ ని అసంతృప్తికి గురి చేస్తోంది