మహేష్ అభిమానులు ఫీలవుతున్నారా

హఠాత్తుగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీని ప్రకటించడం పట్ల మహేష్ అభిమానుల నుంచి నిరసన కనిపిస్తోంది. గుంటూరు కారం షూటింగ్ ఇంకా సగం కూడా అవ్వలేదు. కొద్దిరోజుల క్రితమే వేగమందుకుంది. పలు వాయిదాలు, స్క్రిప్ట్ రిపేర్లు, పూజా హెగ్డేని తప్పించడాలు, తమన్ మీద పుకార్లు ఇలా ఒకటి రెండు కాదు లెక్కలేనన్నీ స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. సరే అయిందేదో అయ్యింది ముందు చెప్పినట్టు సంక్రాంతికి విడుదల చేస్తే చాలని ఫ్యాన్స్ సర్దిచెప్పుకుని అప్ డేట్స్ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. తీరా చూస్తే బన్నీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.

వాళ్ళ ఫీలింగ్ కి కారణం ఒకటే. ఇంకో రెండు మూడు నెలలు ఆగి గుంటూరు కారం చివరి దశలో ఉన్నప్పుడు బన్నీతో సినిమా గురించి ఓపెనయితే బాగుండేదని, ఇప్పుడు సడన్ గా ఇలా చేయడం వల్ల మీడియా అటెన్షన్ కూడా బన్నీ ప్రాజెక్టు మీదకే వెళ్తుందని భావిస్తున్నారు. ఏ జానర్, ఎంత బడ్జెట్, త్రివిక్రమ్ ప్యాన్ ఇండియా రేంజ్ లో ఏం ప్లాన్ చేసుకుంటున్నాడు ఇలాంటి ప్రశ్నలతో దాని గురించే చర్చ జరిగితే గుంటూరు కారం సైడ్ అయిపోతుందని ప్రశ్నిస్తున్నారు. అసలే మాటల మాంత్రికుడు ఒకపక్క పవన్ స్క్రిప్ట్ వ్యవహారాలు చూస్తూ మహేష్ ది లేట్ చేశారనే నింద ఇప్పటికే ఫాన్స్ నుంచి ఉంది.

మహేష్ బాబుతో చర్చించాకే త్రివిక్రమ్ ప్రకటన ఇచ్చి ఉంటారన్న కామెంట్ కూడా ఫిలిం నగర్ వర్గాల్లో ఉంది.కానీ అదెంత వరకు నిజమో చెప్పలేం. ఈ క్షణం వరకు పూజా హెగ్డే స్థానంలో ఎవరు వచ్చారనేది స్పష్టంగా క్లారిటీ ఇవ్వలేదు. శ్రీలీలని మెయిన్ హీరోయిన్ గా చేయడం తప్ప రెండో కథానాయిక పేర్ల గురించి ప్రచారాలు తప్ప కన్ఫర్మేషన్లు లేవు. రాజమౌళి  మూవీకి ఎలాగూ రెండు మూడేళ్లు త్యాగం తప్పదు కాబట్టి దానికన్నా ముందు వచ్చే గుంటూరు కారం బ్లాక్ బస్టర్ రేంజ్ కి తగ్గకూడదనేది ఫ్యాన్స్ ఫీలింగ్. త్రివిక్రమ్ మీడియాకు దొరికితేనే చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి