బ్యాన్ చేశారు…అయినా వదలడం లేదు

ప్రతి శుక్రవారం కొత్త సినిమాలకు సంబంధించి ఫస్ట్ రివ్యూలు వచ్చేది ఉదయం ప్రసాద్ ఐమ్యాక్స్ లో జరిగే 8.45 షో తర్వాతే. పెద్ద హీరోలవి ఇతర చోట్ల తెల్లవారుఝామునే వేస్తారు కానీ మిగిలినవి మాత్రం ఇక్కడే మొదటి స్క్రీనింగ్ జరుపుకుంటాయి. వందలాది యూట్యూబ్ ఛానల్స్, లెక్కలేనంత మంది యాంకర్లతో ప్రాంగణం మొత్తం మధ్యాన్నం పదకొండు తర్వాత కిటకిటలాడేది. అయితే క్రమంగా ఇదో న్యూ సెన్స్ గా మారిపోయింది. ఫ్రీగా పాపులారిటీ వస్తుందనే ఉద్దేశంతో కావాలని వచ్చి అల్లరి చేసే బ్యాచులు పెరిగిపోయాయి. ఆదిపురుష్ టైంలో ఏకంగా కొట్టుకునే దాకా వెళ్ళింది.

ఏళ్ళ తరబడి ఇదంతా భరిస్తూ వచ్చిన ప్రసాద్ యాజమాన్యం వాటిని నిషేధిస్తూ చర్యలు తీసుకుంది. ఈ గోల భరించలేకపోతున్న నెటిజెన్లు హమ్మయ్య అనుకున్నారు. అయితే ఇక్కడితో కథ సుఖాంతం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇప్పుడీ పంచాయితీని ఆ మల్టీప్లెక్స్ గేటు బయట పెడుతున్నారు. లోపలైతే నియంత్రించగలరు కానీ  రోడ్డు మీద జరిగే వాటికి పోలీసులదే బాధ్యత. కాకపోతే ముందు ఉన్నంత తీవ్రంగా ఇప్పుడు రచ్చ చేయడం లేదు కానీ క్రమంగా పెరిగే పరిస్థితులను కొట్టి పారేయలేం. అంతగా వీటికి అలవాటు పడ్డాయి యూట్యూబ్ బృందాలు

ఇంత క్రేజ్ కి కారణం లేకపోలేదు. కేవలం ఐమాక్స్ బయట విచిత్ర ప్రవర్తనతో సినిమా ఛాన్సులు కొట్టేసినవాళ్లున్నారు. బ్రో అంటూ అరుస్తూ రివ్యూలు చెప్పే ఒక అబ్బాయి ముందు చిన్న వేషాలు , తర్వాత సీరియల్ హీరో, ఇప్పుడు ఏకంగా పెయిడ్ సోషల్ మీడియా స్టార్ గా మారిపోయాడు. మేమూ అలా కాకపోమాని కుర్రాళ్ళు కొందరు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఇది రెగ్యులర్ ఆడియన్స్ కి చికాకుగా మారిపోయింది. వ్యవహారం ఎంత దూరం వెళ్లిందంటే కొన్ని సినిమా టీమ్స్ వీళ్లకు డబ్బులిచ్చి మరీ ప్రమోషన్లు చేయించేంతగా. ఏదో ఒక రూపంలో ఇలా అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు మంచిదే