ఔను.. మేం 20 సినిమాలు చేస్తున్నాం

ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌజ్ అయినా.. వాళ్లకు ఎంత బలమైన టీం ఉన్నా.. చేతిలో ఎంత డబ్బున్నా.. ఒకేసారి మూణ్నాలుగు సినిమాలు చేయడమే కష్టం. అలాంటిది ఒక సంస్థ 20-30 సినిమాల దాకా ప్లాన్ చేస్తున్నట్లు..  అవి వివిధ దశల్లో ఉన్నట్లు వార్తలు రావడం టాలీవుడ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. పీపుల్స్ మీడియా సంస్థ ఇలా ఒకేసారి బోలెడన్ని సినిమాలు ప్లాన్ చేస్తోందన్న సమాచారం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.

ఈ ప్రచారంపై పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వ ప్రసాద్ మీడియాతో మాట్లాడాడు. తమ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్న ‘ఆదిపురుష్’ గురించి ఆయన మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తమ సంస్థ జోరు గురించి ఆయన మాట్లాడాడు. తమ సంస్థలో బోలెడన్ని సినిమాలు తెరకెక్కుతున్న విషయం వాస్తవమే అని ఆయన అంగీకరించాడు.

ఐతే ఒకేసారి 30 సినిమాలు తీసేంత సీన్ లేదని.. దాదాపు 20 సినిమాల దాకా వివిధ దశల్లో ఉన్నట్లు ఆయన ధ్రువీకరించాడు. ఐదు సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయని.. 15 సినిమాలు స్క్రిప్ట్, ప్రి ప్రొడక్షన్.. ఇలా వివిధ దశల్లో ఉన్నట్లు విశ్వప్రసాద్ తెలిపారు. తాము చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే ప్రయాణం మొదలుపెట్టామని.. తమ సంస్థలో 25 సినిమాలు తీయడానికి ఐదేళ్లు పట్టిందని.. కానీ  తర్వాతి 25 సినిమాలు ఒకట్రెండేళ్లలో పూర్తి చేసి 50 చిత్రాల మైలురాయిని అందుకుంటామని విశ్వప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.

‘ఆదిపురుష్’ సినిమా మీద తమకు ముందు నుంచి బలమైన నమ్మకం ఉందని, అది బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తుందనే ధీమాతోనే భారీ మొత్తానికి హక్కులు కొన్నట్లు విశ్వప్రసాద్ తెలిపారు. ఈ చిత్రాన్ని నిర్మించిన టీసిరీస్ సంస్థలో తెరకెక్కే తర్వాతి చిత్రాలను తామే తెలుగులో రిలీజ్ చేస్తామని ఆయనన్నారు. అంటే ‘యానిమల్’ను కూడా పీపుల్స్ మీడియా చేతుల మీదుగానే విడుదలవుతుందన్నమాట.