అల్లు సరదా సలహాని లావణ్య పాటించేసింది

జల్సా ఫ్లాష్ బ్యాక్ లో ప్రకాష్ రాజ్ సరదాగా అన్న మాటని నక్సలైట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకుని ఆటపట్టించే సీన్ థియేటర్లో బాగా పేలింది. దీని మీద సోషల్ మీడియా మీమ్స్ ఇప్పటికీ తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రస్తావన రావడానికి కారణం ఉంది. నిన్న రాత్రి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. కొణిదెల అల్లు కుటుంబాల నుంచి అందరూ హాజరయ్యారు. బయటవాళ్లకు ఇన్విటేషన్ లేదు. ఎలాగూ పెళ్లి  తర్వాత రిసెప్షన్ లాంటి వేడుకలు ఉంటాయి కాబట్టి దీన్ని నాగబాబు ఇంటికి పరిమితం చేశారు.

కొంచెం  ఫ్లాష్ బ్యాక్ కి వెళదాం. 2021లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద చావు కబురు చల్లగా సినిమా వచ్చింది. కార్తికేయ హీరో కాగా లావణ్య త్రిపాఠి హీరోయిన్. దాని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సమర్పకుడి హోదాలో వచ్చిన అల్లు అరవింద్ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఎక్కడో ఉత్తరాది రాష్ట్రం నుంచి వచ్చింది ఇక్కడే ఓ తెలుగు కుర్రాడిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిలైపోవచ్చు కదాని సరదాగా నవ్వుతూ అన్నారు. దానికి లావణ్య రియాక్షనూ ఫన్నీగానే ఉంది. కట్ చేస్తే మూడేళ్లు తిరక్కుండానే ఎవరో ఎందుకని మెగా ప్రిన్స్ కి భార్యగా కొణిదెల ఫామిలీలోకి ఎంట్రీ ఇచ్చింది

ఆ వీడియోని ఫ్యాన్స్ ఇప్పుడు బయటికి తీసి జల్సాతో ముడిపెడుతున్నారు. కొన్ని ఏదో యథాలాపంగా అన్నా సరే ఇలా కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. మిస్టర్ తో మొదలైన ఈ జంట పరిచయం అంతరిక్షంలోనూ కొనసాగింది. ఆ సినిమాలు ఫ్లాప్ అయినా రియల్ లవ్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. పైన చెప్పిన చావు కబురు చల్లగా కూడా పోయింది. వివాహం తాలూకు వేదిక తేదీ ఇతర వివరాలు త్వరలో వెల్లడించబోతున్నారు. వేడుకకు సంబంధించిన ఫోటోలు ట్విట్టర్ ఇన్స్ టాలో తిరగేస్తున్నాయి. అల్లు వారి కామెడీ మాట ఫైనల్ గా ఇలా నిజమయ్యిందన్న మాట