విజయ్‌తో గొడవకు అనసూయ ఫుల్ స్టాప్

యాంకర్ టర్న్డ్ యాక్ట్రెస్ అనసూయకు.. యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో ఉన్న గొడవ సంగతి తెలిసిందే. విజయ్ వైపు నుంచి అనసూయ మీద ఇప్పటిదాకా ఏ రియాక్షన్ లేదు కానీ.. ఆమె మాత్రం కొన్నేళ్ల నుంచి అతణ్ని టార్గెట్ చేస్తోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ పలికిన ఒక బూతు మాట విషయంలో అప్పట్లో అనసూయ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో తన అభిమానుల నుంచి వ్యతిరేకత మొదలైంది.

ఇటీవల విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ‘ఖుషి’ పోస్టర్లో తన పేరు ముందు ‘the’ అని పెట్టుకోవడాన్ని ఆమె తప్పుబట్టడంతో తన అభిమానులతో అనసూయకు మరోమారు గొడవ జరిగింది. ఐతే విజయ్‌ను మళ్లీ మళ్లీ అనసూయ టార్గెట్ చేయడాన్ని చాలామంది తప్పుబట్టిన నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో అతడితో తన సమస్య ఏంటో వివరించింది. అంతే కాక తనతో గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేయబోతున్నట్లు కూడా చెప్పింది.

‘‘విజయ్ నాకు ఎంతో కాలం నుంచి పరిచయం. మేమిద్దరం మంచి స్నేహితులమే. ఐతే ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో అభ్యంతరకర పదాలను సెన్సార్ వాళ్లు మ్యూట్ చేస్తే.. విజయ్ ఆ సినిమా విడుదలైనపుడు థియేటర్లకు వెళ్లి అభిమానులతో ఆ పదాలు చెప్పించాడు. ఇది ఒక తల్లిగా నన్నెంతో బాధించింది. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దని విజయ్‌కి చెప్పా. ఆ తర్వాత నాపై ఆన్ లైన్ ట్రోల్స్ మొదలయ్యాయి.

ధైర్యంగా ఆ బాధ నుంచి బయటికి వచ్చి విజయ్ ప్రొడ్యూస్ చేసిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించా. కానీ విజయ్‌కు సంబంధించిన ఒక వ్యక్తి నన్ను ట్రోల్ చేయడం కోసం చాలామందికి డబ్బులు ఇస్తు్నట్లు తెలిసి షాకయ్యాను. విజయ్‌కి తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అనిపించింది. విజయ్ నన్ను ద్వేషిస్తున్నాడో ఏమో నాకు తెలియదు. నేను మాత్రం ఇక్కడితో దీన్ని ఆపేసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నాకు మానసిక ప్రశాంతత ముఖ్యం’’ అని అనసూయ వివరించింది.