‘ఆదిపురుష్’ టీం చేసింది కొత్తేమీ కాదు

ఆదిపురుష్ టీం నిన్న చేసిన ఒక ప్రకటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్లోనూ ఒక సీట్ హనుమంతుడి కోసం ఖాళీగా ఉంచుతామని.. రామ పారాయణం జరిగే ప్రతి చోటుకూ హనుమంతుడు వస్తాడన్న నమ్మకంతో ఇలా చేస్తున్నామని ‘ఆదిపురుస్’ టీం ప్రకటించింది. ఇది వినూత్నమైన, తెలివైన ప్రమోషనల్ ఎత్తుగడ అంటూ చాలామంది కొనియాడుతున్నారు. ఐతే సినిమాను ప్రమోట్ చేయడానికి ఇలా చేయడం కొత్త అయితే కాదు.

తెలుగులోనే కొన్ని సినిమాలకు ఇలాంటి విభిన్నమైన ప్రమోషన్ ప్రయోగాలు చేశారు. 1943లోనే భక్త పోతన సినిమా టీం.. బెంగళూరులో తమ సినిమా ఆడుతున్న థియేటర్ ముందు భారీ హనుమంతుడి కటౌట్ పెట్టి.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

ఇక ‘అన్నమయ్య’ సినిమా ఆడుతున్న థియేటర్లలో వేంకటేశ్వరస్వామి విగ్రహాలు పెట్టించారు అప్పట్లో. అంతకుముందు ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ సినిమాకు కూడా ఇలాగే చేశారు. 90వ దశకంలో రిలీజైన ‘అమ్మోరు’ సినిమా ఆడుతున్న ప్రతి థియేటర్ ముందూ మట్టితో అమ్మోరు బొమ్మ చేయించి పెడితే.. జనం దాన్నో గుడిలాగా భావించి థియేటర్ల నుంచి బయటికి వచ్చాక మొక్కుకుని వెళ్లడం అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఇప్పుడు ‘ఆదిపురుష్’ ఇదే కోవలో, కొంచెం భిన్నంగా హనుమంతుడి కోసం ఖాళీ సీట్ ఆలోచన చేసింది. ఒకప్పటితో పోలిస్తే జనాలు సినిమాల పట్ల అంత ఎమోషనల్‌గా లేని ఈ రోజుల్లో ‘ఆదిపురుష్’ టీం ఎత్తుగడ ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో చూడాలి మరి. ప్రభాస్, కృతి సనన్ రాముడు-సీతగా కనిపించనున్న ఈ చిత్రాన్ని ఓం రౌత్ రూపొందించాడు. ఈ నెల 16న ‘ఆదిపురుష్’ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.