ఆ దర్శకుడి బిల్డప్ మామూలుగా లేదే..

రెండేళ్ల కిందట ‘అ!’ సినిమా విడుదలకు ముందు, తర్వాత ఎంత హడావుడి జరిగిందో తెలిసిందే. దాన్నో గొప్ప ప్రయోగంగా, కళాఖండంగా చూసే వాళ్లు కొందరున్నారు. అదే సమయంలో నాన్సెన్స్ అనే వాళ్లూ లేకపోలేదు. ఐతే బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్నందుకున్న ‘అ!’ కొన్ని అవార్డులు సొంతం చేసుకుంది. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ మీద ఇండస్ట్రీ జనాలకు బాగానే గురి కుదిరింది.

‘గరుడ వేగ’తో బౌన్స్ అయిన సీనియర్ హీరో రాజశేఖర్ అతడితో ‘కల్కి’ చేశాడు. కానీ ప్రోమోలతో వావ్ అనిపించిన ఈ చిత్రం.. తెర మీద తేలిపోయింది. ఈ సినిమా డిజాస్టర్ అయింది. కానీ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆత్మవిశ్వాసం మాత్రం ఏమీ తగ్గలేదు. ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద స్టేట్మెంట్లతో అతను వార్తల్లో నిలుస్తున్నాడు.

కరోనా విలయం సాగుతున్న ఈ సమయంలో ఆ వైరస్ నేపథ్యంలో ‘జాంబీ రెడ్డి’ అనే సినిమాను అనౌన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిన ప్రశాంత్.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ఘనమైన ప్రకటనలే చేస్తున్నాడు. తన దగ్గర ఏకంగా 32 కథలు సిద్ధంగా ఉన్నాయని.. వాటికి స్క్రిప్టులు కూడా రెడీ అయ్యాయని అతను చెప్పడం విశేషం.

వీటిలో కొన్ని వెబ్ సిరీస్‌లుగా వస్తాయని అన్నాడు. స్క్రిప్ట్ విల్లీ పేరుతో ఓ టీంను ఏర్పాటు చేసి స్క్రిప్టులు తయారు చేయడమే పనిగా పెట్టుకున్నాడు ప్రశాంత్. ఇలాంటి సినిమాలు తెలుగులో వర్కవుటవుతాయా అని జనాలు సందేహించే సినిమాలే చేయాలన్నది తన అభిమతమంటూ అతను స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం.

‘అ!’ చిత్రాన్ని హిందీ, తమిళంలో రీమేక్ చేయమని ఆఫర్లు వచ్చినా తాను తిరస్కరించానని.. సొంత భాష మీద ప్రేమ ఉండటమే అందుక్కారణమని.. ‘అ!’కు సీక్వెల్ కూడా తెలుగులోనే చేయాలని చూస్తున్నానని.. వేరే భాషలకు ఎప్పుడు వెళ్తానో చెప్పలేనని ప్రశాంత్ అన్నాడు.