రూపాయి పెడితే.. నాలుగు రూపాయలు వచ్చాయి

గీతా ఆర్ట్స్ సంస్థ ఈ మధ్య తెలుగులో తీస్తున్న డైరెక్ట్ సినిమాల కంటే.. అనువాద చిత్రాలతోనే మంచి ఫలితాలు అందుకుంటోంది. ఆ సంస్థ నుంచి గత ఏడాది వ్యవధిలో వచ్చిన స్ట్రెయిట్ సినిమాలు పక్కా కమర్షియల్, వినరో భాగ్యము విష్ణు కథ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. కానీ కన్నడ అనువాద చిత్రం ‘కాంతార’ అనూహ్యమైన వసూళ్లతో అదరగొట్టింది. అలాగే తమిళ డబ్బింగ్ మూవీ ‘విడుదల’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది.

తాజాగా మలయాళ అనువాద చిత్రం ‘2018’ సైతం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది. కేరళలో సంచలన విజయం సాధిస్తూ మాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిత్రమిది. కాంతార, విడుదల సినిమాల మాదిరే.. ఒరిజినల్ వెర్షన్లు మంచి టాక్ తెచ్చుకుని మంచి రన్‌తో సాగుతున్న టైంలోనే హడావుడిగా దీన్ని కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. పెద్దగా పబ్లిసిటీ కూడా చేయలేదు. అయినా జనం ఈ సినిమాను బాగానే చూస్తున్నారు.

గత వారం విడుదలైన తెలుగు చిత్రాల్లో ‘మేమ్ ఫేమస్’ ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. ‘మళ్ళీ పెళ్ళి’ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ రెంటితో పోలిస్తే ‘2018’కే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఆ సినిమాలు నెమ్మదిస్తుంటే.. ఈ చిత్రం మాత్రం అంతకంతకూ వసూళ్లు పెంచుకుంటూ వెళ్లింది. ఉన్న వాటిలో బెస్ట్ మూవీగా దీనికే ప్రేక్షకులు ప్రాధాన్యం ఇచ్చారు. సినిమా కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కినప్పటికీ.. అందులోని ఎమోషన్లు మాత్రం భాషా భేదం లేకుండా అందరినీ ఆకట్టుకునేవే.

ముఖ్యంగా ఈ చిత్రానికి సెకండాఫ్ మేజర్ హైలైట్‌గా నిలిచింది. తొలి రోజు నుంచి నిలకడగా వసూళ్లు రాబట్టిన ‘2018’ ఇప్పటికే నాలుగు కోట్ల దాకా షేర్ రాబట్టడం విశేషం. ఈ చిత్ర హక్కుల కోసం గీతా వారు పెట్టిన పెట్టుబడి కోటి రూపాయలేనట. దీనికి కొంత డబ్బింగ్, పబ్లిసిటీ ఖర్చు తోడైంది. అలా అని వాటి కోసం కూడా పెద్దగా ఏమీ ఖర్చు పెట్టేయలేదు. మొత్తానికి సినిమా మీద రూపాయి పెడితే నాలుగు రూపాయల ఆదాయం అంటే ఇది బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి.