బీజేపీ.. ఇంకో సినిమా రెడీ చేస్తోంది

అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అనుకూలంగా, ప్రతిపక్షాలను టార్గెట్ చేసేలా సినిమాలు రావడం.. వాటికి అధికార పార్టీ నుంచి పరోక్ష మద్దతు లభించడం కొత్తేమీ కాదు. కానీ ఈ మధ్య భారతీయ జనతా పార్టీ కొత్త ఒరవడి సృష్టిస్తోంది. తమ పార్టీ నేతలు లేదా తమకు అనుకూలంగా ఉన్న వ్యాపారవేత్తలు, నిర్మాతలతో పెట్టుబడులు పెట్టించి తమకు అనుకూలంగా వరుసబెట్టి సినిమాలు తీయిస్తోందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

గత ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద వివేక్ ఒబెరాయ్‌ను పెట్టి ఏకంగా ఒక సినిమా తీసేశారు. అంతే కాక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా ఒక సినిమా తీయించారు. అవి చాలవన్నట్లు ముస్లింలను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ లాంటి సినిమాలకు తెర వెనుక, తెర ముందు బీజేపీ ఇచ్చిన మద్దతు గురించి అందరికీ తెలిసిందే.

ఈ వివాదాస్పద చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి ఫలితాలను అందుకున్నాయి. దీంతో మరింత ఉత్సాహంగా ఇలాంటి సినిమాలు మరిన్ని తీయించే ప్రయత్నంలో బీజేపీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోంది. గాంధీని మించి గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడుగా బీజేపీ ఎలివేట్ చేస్తున్న వీర్ సావర్కర్ మీద రెండు సినిమాలు రెడీ అవుతున్నాయిప్పుడు. అందులో ఒక సినిమాలో మన టాలీవుడ్ కథానాయకుడు నిఖిల్ లీడ్ రోల్ చేస్తున్నాడు. కొత్తగా ‘గోద్రా’ పేరుతో రూపొందుతున్న ఓ సినిమా వెనుక కూడా బీజేపీ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

2002 నాటి గోద్రా అల్లర్ల ఉదంతంలో మోడీ ప్రతిష్ట బాగా దెబ్బ తింది. ఆ అల్లర్ల వెనుక ఆయన హస్తం ఉందనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ఈ కేసుల నుంచి ఆయన నిర్దోషిగా బయటపడి ఉండొచ్చు కానీ.. ముస్లింల మీద దాడికి పురిగొల్పింది అప్పటి మోడీ నేతృత్వంలోని గుజరాత్ సర్కారే అని చాలామంది నమ్ముతారు. ఐతే ఇప్పుడు ఈ అల్లర్ల విషయంలో బీజేపీ వెర్షన్‌నే ‘గోద్రా’ సినిమాలో చూపించబోతున్నట్లు కనిపిస్తుంది. అప్పుడు జరిగింది ప్రమాదమా.. కుట్రా అని ఈ సినిమాలో చర్చించబోతున్నారు. టీజర్లో ఎక్కువ వివరాలు, విశేషాలు వెల్లడించలేదు. కానీ ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్లందరూ బీజీపే మద్దతుదారులే. కాబట్టి ‘గోద్రా’ సినిమా ఎలా ఉండబోతోందో అంచనా వేయడం కష్టం కాదు. చూస్తుంటే వచ్చే ఏడాది ఎన్నికల్లోపు ఈ తరహా సినిమాలను బీజేపీ వాళ్లు మరిన్ని వదిలేలా కనిపిస్తున్నారు.