సోషల్ మీడియాకు అంత సీన్ ఉందా

ఇప్పుడంతా ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ టా యుగం. తాతలు నాన్నల కాలంలో న్యూస్ పేపర్లు, టీవీ ఛానల్స్ మీద ఆధారపడే వాళ్ళు కానీ కొత్త జనరేషన్ కుర్రకారు మొత్తం సోషల్ మీడియాలోనే మునిగి తేలుతోంది. ఏదైనా కొత్త రిలీజ్ వస్తే ఆలస్యం దాని తాలూకు యుఎస్ టాక్ నిమిషాల్లో కాదు సెకండ్లలో యూసఫ్ గూడలో ఉన్న డిగ్రీ కుర్రాడి స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేస్తోంది. అది పాజిటివ్ అయినా నెగటివ్ అయినా దాని తాలూకు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ సమస్య యావరేజ్ లేదా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న వాటికి ఎక్కువగా ఉంది తప్ప బ్లాక్ బస్టర్స్ ని ఎవరూ ఏమీ చేయలేరు

మొన్న రిలీజైన మేం ఫేమస్ టీమ్ ఈ విషయంగా బాగా హర్ట్ అయిపోయింది. కొందరు కావాలని నెగటివ్ ప్రాపగండా చేస్తున్నారని కొత్త కుర్రాళ్ళు చేసిన ప్రయత్నాన్ని థియేటర్లలో అందరూ మెచ్చుకుంటే టార్గెట్ గా పెట్టుకున్న గ్రూప్స్ మాత్రం యాష్ ట్యాగ్స్ పెట్టి ఉద్దేశపూర్వకంగా బ్యాడ్ చేయడం వల్ల దానికి పని చేసిన వాళ్ళందరూ బాధ పడుతున్నారని నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఈ ఆవేదనలో న్యాయముంది. అలా అని కంటెంట్ బ్రహ్మాండంగా ఉంటే పిల్లగాలి లాంటి ఈ పుకార్ల బ్యాచులు చేసేదేమీ ఉండదు. సక్సెస్ ని ఆపేంత సీన్ వీటికి ఖచ్చితంగా లేదు.

కాకపోతే మేం ఫేమస్ కి మిశ్రమ స్పందన రావడం వల్ల ఈ చిక్కొచ్చి పడింది. ఇదే నిర్మాణ సంస్థ రైటర్ పద్మభూషణ్ కు  అన్ని వర్గాల నుంచి మద్దతు వచ్చిందిగా. అయినా మహేష్ బాబు, రాజమౌళి అంతటి వాళ్లే మెచ్చుకున్నప్పుడు ట్విట్టర్ లో ఫేక్ ఐడిల వాళ్ళు ప్రతికూలంగా ప్రచారం చేసినా చేయకపోయినా పోయేది ఏముంది. టెక్నాలజీ ట్రెండ్ లో ఎవరూ ఎవరిని నియంత్రించలేరు. కేవలం గమనించి విశ్లేషించుకోవడం తప్ప . రండి మాట్లాడుకుందాం బాలేదన్న వాళ్ళు కలవండి లాంటి పిలుపుల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. బాగుండే ఆడేస్తాయి. ఇదే సింపుల్ ప్రిన్సిపుల్