టెన్షన్ పెడుతున్న దృశ్యం 3 స్పీడు

ఫ్యామిలి థ్రిల్లర్ అనే కొత్త జానర్ సృష్టించిన దృశ్యం నుంచి మూడో భాగం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దర్శకుడు జీతూ జోసెఫ్ మలయాళ వెర్షన్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిన్నటితో మోహన్ లాల్ టాకీ పార్ట్ ఫినిష్ కావడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత వేగంగా అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడీ పరిణామం ఇద్దరు హీరోల నిర్మాణ సంస్థలను, ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. హిందీలో అజయ్ దేవగన్ ఎప్పుడెప్పుడు దీన్ని తీద్దామాని వెయిట్ చేస్తున్నాడు. కానీ జీతూ జోసెఫ్ టీమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వెళ్ళలేదు. దీంతో కొత్త కథని కూడా రిజర్వ్ లో పెట్టి ఉంచారట.

అయితే అదే పేరుతో తీస్తే లీగల్ గా సమస్యలు వస్తాయి కాబట్టి ఏం చేయాలనే దాని మీద అజయ్ బృందం తర్జన భర్జన పడుతోందని ముంబై టాక్. ఇక వెంకటేష్ తో తీయాల్సిన తెలుగు రీమేక్ పనులు ఇంకా మొదలవ్వలేదు. మన శంకరవరప్రసాద్ గారు కోసం డిసెంబర్ దాకా డేట్లు ఇచ్చిన వెంకీ నెక్స్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సెట్స్ లోకి అడుగు పెట్టేస్తారు. ఇది వేసవిలో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. అప్పటిదాకా ఈయన అందుబాటులోకి రావడం అనుమానమే. దృశ్యం 3ని దీంతో సమాంతరంగా తీద్దామంటే లుక్స్ సమస్య రావొచ్చని ఆ ప్రతిపాదన పెండింగ్ పెట్టారట. సో కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది.

ఇదంతా ఎలా ఉన్నా మోహన్ లాల్ దృశ్యం 3 ముందు రిలీజైపోవడం ఖాయం. మూవీ లవర్స్ ఉండబట్టలేక ఏదోలా దాన్ని చూసేస్తారు. ట్విస్టులు స్పాయిలర్స్ రూపంలో సోషల్ మీడియాలో వచ్చేస్తాయి. వీటిని కంట్రోల్ చేయడం అసాధ్యం. పైగా ఓటిటి డీల్ కూడా నూటా ముప్పై కోట్లకు జరిగిందని మల్లువుడ్ టాక్. అదే నిజమైతే నెల లేదా నలభై అయిదు రోజుల్లోనే డిజిటల్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది. ఇదంతా చూసి అజయ్ దేవగన్, వెంకటేష్ లు దృశ్యం 3ని వేగంగా పట్టాలు ఎక్కించేందుకు పూనుకుంటారా లేదానే ప్రశ్న అభిమానుల మెదళ్లను తొలుస్తోంది.